విభజన లేఖ ఇచ్చిందెవరో?: పాపం చంద్రబాబుదేనని బీజేపీ ఎదురుదాడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తాం కానీ, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో బీజేపీ-టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా పెరిగింది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీపై లోక్సభలో గురువారం ప్రత్యేకంగా ప్రకటన చేశారు. ఏపీని విభజన చేసింది యూపీఏ ప్రభుత్వమని, అయినా సరే యూపీఏ ఇచ్చిన హామీలను మేం నెరవేరుస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశమే లేదని అలాంటిది మేం ఏపీకి ప్రత్యేకహోదా ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. అయితే అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందని, రాష్ట్రంలోని బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారు. అసలు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిందే మీరు కదా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా విషయంపై ఢిల్లీలో ఏపీ బీజేపీ-కేంద్రప్రభుత్వం మధ్య అనుసంధాకర్తగా వ్యవహరిస్తున్న బిజెపి ఏపి సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ-టీడీపీ సంబంధాలు, పోలవరం సహా రాష్ట్రానికి రావలసిన నిధులు, జగన్తో సంబంధాలపై రఘురాం తన అభిప్రయాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదని, అది ఒకరకంగా టిడిపికే మంచిదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఒక పార్టీ ఎదగాలంటే మరో పార్టీ అనుమతి అవసరం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో "బిజెపి ప్రభుత్వంపై టిడిపి నేతల విమర్శలు బాధ్యతారాహిత్యం, బాధాకరం. మేం దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రధర్మాన్ని పాటించాలి.
అందుకే మేం ఇప్పటిదాకా టిడిపి ప్రభుత్వంపై ఇంత వరకూ ఏమీ మాట్లాడటం లేదు. మాకూ మాట్లాడటం వచ్చు. మాకూ వాళ్లకం టే ఎక్కువమంది మాట్లాడే నేతలున్నారు. మోడీ ప్రభుత్వం ఏపికి ఇంత చేస్తున్నా ఏమీ చేయడం లేదని దుష్ప్రచారం చేయడం దారుణం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్థిలో కేంద్రంలోని బిజెపి కూడా భాగస్వామి. పోలవరం అనుకున్న సమయంలో పూర్తి చేస్తాం.
మా బాధ్యతను ఎవరూ గుర్తు చేయాల్సిన పనిలేదు. బిజెపితో కలసి ఉన్నప్పుడే టిడిపి అధికారంలోకి వచ్చింది. మాతో పొత్తు లేకుండా పోటీ చేసిన రెండుసార్లు ఓడిపోయిన వాస్తవాన్ని గ్రహించాలి' అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీని, కేంద్రాన్ని టీడీపీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు బాహాటంగా విమర్శిస్తున్నారు.
అంటే అధినేత చంద్రబాబు అనుమతితోనే వారు విమర్శలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇది భావ్యం కాదని, హోదాపై బాబు ఏమన్నారో ఓసారి వెనక్కి వెళ్లి చూడండి. ప్రత్యేక హోదాతోనే అన్నీ అయిపోవని అనలేదా? హోదా ఇచ్చిన రాష్ట్రాలు ఏమి అభివృద్ధి చెందాయని వ్యాఖ్యానించలేదా? విభజన చట్టంలో ఏముందో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారి చదవాల్సిన అవసరం ఉందన్నారు.
బిజెపిని ప్రజల దృష్టిలో ముద్దాయిలుగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తే సహించేలేదని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే అని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం, బిజెపి ఏది చెబుతుందే అదే చేస్తుందని అన్నారు. ఏది చేస్తుందో అదే చెబుతుందని అన్నారు. అది మా పార్టీ విధానం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. అది ప్రతిపార్టీకి వర్తిస్తుంది. అందులో బిజెపికి మినహాయింపేమీ లేదని చెప్పుకొచ్చారు.
కానీ మేం ఓట్ల కోసం ఎన్నికల కోసం రాజకీయం చేయడం లేదని అన్నారు. భారతదేశ అభివృద్ధి, భారతీయత, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించటం, పేద, మధ్య, సామాన్య ప్రజల జీవన స్ధితిగతులను మెరుగుపరచడం, కార్మికులకు జీవన భద్రత కల్పించడం వంటివి బిజెపి మౌలిక లక్ష్యాలని గుర్తు చేశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా మా అజెండా అదేనని అన్నారు. వాటిని ఈ రెండేళ్లలో పూర్తి చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఇన్నేళ్లూ వాటిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, ఇప్పుడు ఈ రెండేళ్లలో పూర్తి చేయాలంటోందని అన్నారు. మోడీ పనితీరును ప్రపంచం మెచ్చుకుంటుంటే, కాంగ్రెస్, ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తున్నాయి. కనీసం మంచిని కూడా అభినందించ లేని ప్రతిపక్షం ఉండటం ప్రజల దురదృష్టమన్నారు.
'ఏపిలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. విభజన సమయంలోనే ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించని కాంగ్రెస్, ఇప్పుడు దానిగురించి మాట్లాడుతోంది. ఎలాగూ మోడీ సర్కారు వస్తుంది కదా? హోదా ఎలా ఇస్తారో చూద్దామనే దుర్భుద్ధి రాజకీయంతోనే నాడు బిల్లులో ఆ విషయాన్ని చేర్చి ఆమోదించలేదు. ఆ పాపం కాంగ్రెస్దే. హోదా కోసం చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. అది చాలా పాత డిమాండ్. దానిపై విస్తృతమైన చర్చ అవసరం. ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తామని మంత్రి వెంకయ్య ఇప్పటికే చెప్పారు' అని అన్నారు.