రెడ్డి నేతలపై బిజెపి కన్ను: రామ్ మాధవ్కు బాధ్యత
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రస్తుతం చౌరస్తాలో ఉన్నారని బిజెపి భావిస్తోంది. చాలా మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా, కొంత మంది కాంగ్రెసు పార్టీలో ఉండిపోయారు. కాంగ్రెసులో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలపై బిజెపి కన్నేసినట్లు చెబుతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం కూటమి కాపు, కమ్మ సామాజిక వర్గాలను కూడగట్టడంలో విజయం సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ద్వారా అది సాధ్యమైంది.
రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు రాబట్టుకోగలిగితే ఆంధ్రప్రదేశ్లో బలమైన శక్తిగా ఎదగవచ్చునని బిజెపి జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు బలంగా ఉన్నారు. తమ వ్యూహంలో భాగంగా బిజెపి నాయకులు నెల్లూరు జిల్లాకు చందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో, రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడికి ఆనం సోదరులతో సత్సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో బాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా మాట్లాడేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని, ఈ స్థితిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ పార్టీల నాయకులు తమ వైపు వచ్చే అవకాశాలుంటాయని భావించి బిజెపి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.