ఏపీలో కరోనా ఎఫెక్ట్: బీజేపీ ఇన్చార్జిగా తెలంగాణ నేత లక్ష్మణ్ నియామకం
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకరంగా మారింది. అధికార యంత్రాంగానికితోడు, నిత్యం ప్రజల మధ్య ఉండే రాజకీయ పార్టీలు సైతం తమ వంతు బాధ్యతగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పథకాల పంపిణీలపై శ్రద్ధవహించగా, ప్రతిపక్ష టీడీపీ నేతలు సైతం రోడ్లపైకొచ్చి కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు వీలైనన్ని ఎక్కువసార్లు వీడియోల ద్వారా సూచనలు చేస్తున్నారు. ఇక ఏపీ బీజేపీకి సంబంధించి కరోనా వ్యవహారాల ఇన్ చార్జిగా ఆ పార్టీ తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ నియమితులయ్యారు.
కరోనా క్రైసిస్ కు సంబంధించి ఏపీలో బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చెప్పుకోదగ్గరీతిలో పనులు జరుగుతున్నప్పటికీ.. కొత్తగా తెలంగాణకు చెందిన లక్ష్మణ్ ను ఇన్ చార్జిగా నియమించడం చర్చనీయాంశమైంది. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ సమయంలో పోలీసుల తీరు, కోతల సమయంలో రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా ఎప్పటికప్పుడు జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచుతూనేఉన్నారు. ఏపీలో చేపట్టిన ఇన్ చార్జి నియామకం.. తెలంగాణలో మాత్రం లేకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపర్చింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఏపీలో కరోనా వైరస్ సంబంధిత అంశాల ఇన్ చార్జిగా ఆదివారమే బాధ్యతలు తీసుకున్న లక్ష్మణ్.. 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో ఫోన్ లో సంభాషణలు జరిపారు. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయా జిల్లాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, పోలీసులకు సహకరిస్తూ, కేంద్రం విధించిన లాక్ డౌన్ సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. వలస కూలీలకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని కోరారు.
కరీంనగర్ ఎంపీగా కొనసాగుతోన్న బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత.. డాక్టర్ లక్ష్మణ్ చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. కరోనా విజృంభణ, ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటనల తర్వాత మళ్లీ యాక్టివిటీలు పెంచారు. హైదరాబాద్ లో మాస్కుల పంపిణీ, పేదలకు భోజన వసతి కల్పిస్తూ, అటు ఏపీలోనూ కరోనా సంబంధింత వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో వైరస్ బాధిత జాబితాలో రాష్ట్రం పైపైకి పోతున్నది. సోమవారం మధ్యాహ్నం సమయానికి విశాఖపట్నంలో రెండు కేసులు నమోదు కావడంతో వైరస్ బారినపడినవాళ్ల సంఖ్య 23కు పెరిగింది. అయితే ఇందులో ఇద్దరు చికిత్స తర్వాత కొవిడ్-19 నుంచి కోలుకున్నారు.