చంద్రబాబును దొంగలా: వెల్లంపల్లి షాకింగ్ కామెంట్స్, ఏపీ బీజేపీ నేతల పైనా..
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చంద్రబాబును దొంగలా చూస్తోందని ధ్వజమెత్తారు.
ఏపీలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లాయని విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు దొంగ లెక్కల వల్ల ఏపీకి న్యాయం జరగడం లేదన్నారు.
చంద్రబాబును దొంగలా చూస్తోన్న కేంద్రం
కేంద్రం చంద్రబాబును ఓ దొంగలా చూస్తోందని చెప్పారు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రజల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారని, అందుకే తాను వైసిపిలో చేరుతున్నానని చెప్పారు.
పార్థసారిథి నిలదీత
వైసిపి మరో నేత పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. మూడు అబద్దాలు, ఆరు మోసాలుగా చంద్రబాబు పాలన సాగుతోందన్నారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, బడా వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పారిశ్రామికవేత్తల మెప్పు కోసం తాపత్రయపడుతున్నారన్నారు.
బీజేపీ మాట్లాడలేకుండా ఉందని పార్థసారథి
తన తప్పులు, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో బెజవాడలో 40 ఆలయాలు కూలగొట్టారని, అయినా బీజేపీ మాట్లాడే పరిస్థితిలో లేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన గొప్పేనని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ తర్వాత పర్యావసనాల గురించి ఆలోచించారా అని నిలదీశారు.
టిడిపి నుంచి వైసిపిలోకి క్యూ.. మేకా
వచ్చే ఏడాది టిడిపి ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వరుస కడతారని నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు అన్నారు. టిడిపి సీనియర్లు కూడా వైసిపిలోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను చంద్రబాబు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.