వైసీపీకి బీజేపీ భారీ ట్విస్ట్ : దేశ రెండో రాజధానిగా అమరావతి..?కేంద్రం వద్ద సంచలన ప్రతిపాదన
Recommended Video
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రాజధాని చుట్టూ తిరుగుతుండగా మరోవైపు కేంద్రం మదిలో మరో ఆలోచన ఉన్నట్లు సమాచారం. అమరావతిని ఒక రాజధానిగా ఉంచుతూనే అధికార వికేంద్రీకరణ పేరుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, జ్యుడీషరీ క్యాపిటల్గా కర్నూలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి శాసనసభలో ఆమోదం పొందేలా చేసింది. అయితే కేంద్రం వైసీపీకి ట్విస్ట్ ఇచ్చేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ పట్టు సాధించాలన్న కసితో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
దేశ రెండో రాజధానిపై దృష్టి సారించిన బీజేపీ సర్కార్
బీజేపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచే పలు సంచలన నిర్ణయాలతో ముందుకు వెళుతోంది. ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఉగ్రశిబిరాలపై దాడులు,జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి అనంతరం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం, పౌరసత్వ సవరణ చట్టం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్య రామమందిరం ఐదునెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం, ఎన్ఆర్సీ వంటిచాలా సాహసోపేతమైన నిర్ణయాలను చేశారు. తాజాగా దక్షిణాదిపై కమలనాథులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటినుంచో చర్చలకే పరిమితమైన దేశ రెండో రాజధాని అంశంపై బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
దేశ రెండో రాజధానిగా అమరావతి..?
దేశ రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో ఉండాలని రాజ్యాంగంలో సూచించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఇప్పుడు ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. అది కొంచెం కష్టమే అయినప్పటికీ ఆ ప్రయత్నం దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అయితే దేశ రెండో రాజధానిగా అమరావతి అయితే బాగుంటుందన్న యోచనలో ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని వారు బీజేపీ పెద్దల ముందు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అమరావతిని రెండో రాజధానిగా చేస్తే ఇటు వైసీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లు అవుతుంది.
ఆర్ఎస్ఎస్ మదిలో దేశ రెండో రాజధానిగా అమరావతి
ఇక దేశ రెండో రాజధాని ఏదైతే బాగుంటుందో అనేదానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం కూడా బీజేపీ పెద్దలు తెప్పించుకున్నట్లు సమాచారం. హైదరాబాదుపై ముందుగా మొగ్గు చూపినప్పటికీ అది తెలంగాణ సీఎం కేసీఆర్కు మేలుచేసినట్లు అవుతుంది తప్పితే తమకు వచ్చే లాభం ఏమీ లేదని బీజేపీ గ్రహించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అమరావతి వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆర్ఎస్ఎస్ కూడా అమరావతి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. చారిత్రకంగా, సంస్కృతి, సముద్రతీరం, వాతావరణం, ఇలా అన్నిటిపరంగా అమరావతి అనువైన రాజధాని అవుతుందని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు సంచలనాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్న ప్రధాని మోడీకి దక్షిణాదిన పూర్తి పట్టు సాధించాలంటే అమరావతే సరైన మార్గంగా కనిపిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకే...
అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి ఇటు ఏపీలో పట్టుసాధించాలని భావిస్తున్నారు కమలనాథులు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రధాని మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాల్లో ఇప్పటికే కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలు వేరయ్యాక ఆంధ్రప్రదేశ్లో నిధుల కొరత కనిపిస్తోంది. అభివృద్ధి చేయాలంటే నిధులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అందుకే అమరావతిని దేశ రెండో రాజధానిగా ప్రకటించి ఇటు రాజకీయంగాను దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలని బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాదు రెండో రాజధానిగా తోసిపుచ్చిన కేంద్రం
తమిళనాడులో అన్నాడీఎంకే రజినీకాంత్లను కలుపుకుని పోవాలనే ఆలోచన చేస్తోంది బీజేపీ. తద్వారా తమిళనాడులో తమ ప్రాబల్యం పెంచుకోవచ్చనే ఆలోచనలో ఉంది. ఇక కర్నాటకలో బీజేపీకి ఎలాగూ పట్టు ఉంది కాబట్టి రాజధాని దక్షిణాది రాష్ట్రాలకు తీసుకొచ్చామని చెప్పుకోవడం ద్వారా మరింత బలపడే అవకాశాలున్నాయని భావిస్తోంది. మరోవైపు జేడీఎస్తో కూడా బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక కేరళ దేశంలో చివరిగా ఉండటంతో కేరళను పెద్దగా పరిశీలనలోకి తీసుకో లేదని తెలుస్తోంది. అమరావతి మీద దృష్టి సారిస్తే ఇటు ఏపీలో పట్టు సాధించడం ద్వారా అదే సమయంలో దక్షిణాదికి దేశ రెండో రాజధాని తీసుకొచ్చామనే సంకేతాలను పంపి తద్వారా బలపడేందుకు బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకోవడం ద్వారా పుంజుకుందని భావిస్తోంది.దేశ రెండవ రాజధానిగా హైదరాబాదుపై గతంలోనే చర్చ వచ్చినప్పటికీ కేంద్రం దాన్ని తోసిపుచ్చింది. తాజాగా ఆర్ఎస్ఎస్ అభిప్రాయం, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో మళ్లీ దేశ రెండవ రాజధాని అంశం తెరపైకి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో రెండో రాజధాని ఉంటే మాత్రం అది అమరావతిలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది.