రూ.500తో పోయే బాబ్లీ కేసుపై రాద్ధాంతం, జగన్కిస్తే అలా, మీకు వస్తే ఇలా: బాబుపై విష్ణు
అమరావతి: సానుభూతి కోసమే తెలుగుదేశం పార్టీ నాయకులు వారెంట్ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఆదివారం మండిపడ్డారు. రూ.500తో పోయే కేసు మీద ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారెంట్ల డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
ఆశ్రమం మూసివేతకు జేసీ పట్టు, కొందరి వల్ల చెడ్డపేరు.. పోలీసుల ఇష్టం!: బాబు ఆగ్రహం
శివాజీతో డ్రామాలు ఆడించేది టీడీపీయే
నటుడు శివాజీతో డ్రామా ఆడించేందు తెలుగుదేశం పార్టీయేనని విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోడీ చేయించారని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. అదే నోటీసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు.
గవర్నర్ను కలిసిన టీడీపీ బృందం
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పదహారు మందికి ఎనిమిదేళ్ల తర్వాత నోటీసులు ఇవ్వడంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కేసు ఉపసంహరణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు.
అక్రమంగా కేసులు పెట్టారు
అనంతరం తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, మరో నేత రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ కుమ్మక్కై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఐక్య రాజ్య సమితిలో చంద్రబాబు ప్రసంగించకూడదనే ఈ కేసును తెరపైకి తెచ్చారన్నారు.
అవగాహన లేదు
కేసీఆర్కు బాబ్లీ ప్రాజెక్టు పైన ఏమాత్రం అవగాహన లేదని రమణ అన్నారు. కేసీఆర్ పాలన నీరో చక్రవర్తిని తలపిస్తోందన్నారు. బాబ్లీ ప్రాజెక్టు కేసులో కోర్టు తీర్పుపై ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర పన్ని చంద్రబాబుకు నోటీసులు వచ్చేలా చేశారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ఆరోపించారు. బాబ్లీ పూర్తయితే ఎస్సారెస్పీకి నష్టం జరుగుతుందనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని చెప్పారు.