అసలు అంత దమ్ము, ధైర్యం ఉందా: కేసీఆర్ మాటలకు చంద్రబాబు ఫీజులు ఎగిరిపోయాయా?
అమరావతి: రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతల ఫీజులు ఎగిరిపోయాయా? అంటే అవుననే అంటున్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ భారతీయ జనతా పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉదహరిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి చెందిన వాడు కాదని, అలాంటి వ్యక్తి ఏపీకి ప్రత్యేక హోదా కోసం లేఖ రాస్తామని చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం దానిని స్వాగతించకుండా రాజకీయం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ బహిరంగ సభలో మండిపడ్డారు. అలాగే, చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా స్పందించారు.
చంద్రబాబు ధైర్యం ఉందా?
ఈ మేరకు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ మాటలకు టీడీపీ నేతల ఫీజులు ఎగిరిపోయాయని విమర్శించారు. కేసీఆర్ తిడితే టీడీపీ నేతలు బీజేపీని తిట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కేసీఆర్ మాటలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. హైకోర్టు నిర్మాణానికి కేంద్రం డబ్బులు ఇస్తే ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. హైకోర్టు భవనాలు సిద్ధంగా ఉన్నాయని సుప్రీం కోర్టుకు చంద్రబాబు ప్రభుత్వం అబద్దాలు చెప్పిందన్నారు.
కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక
ఏపీలో టీడీపీ నేతల కోసం పిచ్చాసుపత్రిని కట్టించాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, టీడీపీ నేతలు బీజేపీని టార్గెట్ చేశారన్నారు. కేసీఆర్ ఏపీకి సంబంధించి సంచలన విషయాలు మాట్లాడారని చెప్పారు. సహజంగా ఓ రాష్ట్ర సీఎం మాట్లాడితే మరో రాష్ట్ర సీఎం సమాధానం చెబుతారని, కానీ కేసీఆర్ మాటలకు టీడీపీ నేతల ఫీజులు ఎగిరిపోయి కేసీఆర్ గురించి మాట్లాడకుండా బీజేపీపై తిట్ల పురాణం మొదలుపెట్టారన్నారు.
చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం ఉందా?
కేసీఆర్ మాట్లాడిన అంశాల మీద మాట్లాడేందుకు చంద్రబాబుకు, కేబినెట్ మంత్రులకు, టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉన్నాయా విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయమైన, వైఫల్య ప్రభుత్వమన్నారు. వీధిరౌడీల భాషను టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కల్లుతాగిన కోతుల్లా అరిచారు
కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు, ఏపీ కేబినెట్ మంత్రులు కల్లుతాగిన కోతుల్లా అరుస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. పదేళ్లు ఉన్నప్పటికీ చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని కేసీఆర్ అడుగుతున్నారని, దానికి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు. ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారన్నారు.