విశాఖ ఘటనపై జగన్ స్పందనకు అరుదైన ప్రశంస... ప్రత్యర్ధులు సైతం...
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ చోటు చేసుకున్న ఘటన తర్వాత ఏపీలో వైసీపీ సర్కారు స్పందించిన తీరుపై రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో సైతం సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. గ్యాస్ లీక్ ఘటనపై అర్ధరాత్రి డయల్ 100కు సమాచారం రాగానే పోలీసులు వెంటనే స్పందించడం, ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం కావడం, తర్వాత సీఎం జగన్ అక్కడికి చేరుకుని బాధితులకు భరోసా ఇవ్వడం, అన్నింటికీ మించి కోటి రూపాయల సాయం ప్రకటించడం వంటి అంశాలు ప్రజల్లో ప్రభుత్వానికి మంచి మార్కులే వేశాయి.
మరోవైపు విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత జగన్ సర్కారు తీసుకున్న చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ స్వాగతించారు. జగన్ ప్రభుత్వంపై తరచుకూ విమర్శలకు దిగుతున్న కన్నా... ఇవాళ విశాఖ పర్యటన తర్వాత జగన్ చర్యలను స్వాగతించడం ఆసక్తి రేపుతోంది. అయితే అదే సమయంలో విశాఖ ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించాలని కన్నా డిమాండ్ చేశారు.
బీజేపీ బృందంతో కలిసి ఇవాళ గ్యాస్ లీక్ ఘటనా స్ధలిని, ఆస్పత్రులను సందర్శించిన కన్నా... ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నట్లు చేసిన ప్రకటన పార్టీ నేతల్లోనూ ఒకింత ఆశ్చర్యం కలిగించింది. అయితే విశాఖ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్.. గ్యాస్ లీక్ బాధితులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సానుకూల స్పందన తెచ్చిందని బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు.