ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా బిజెపి ఆందోళన:సోమూ వీర్రాజు,సిఎంకు కన్నా ఐదో లేఖ
విజయవాడ: పంచాయతీల్లో అధికారుల పాలన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తామని బీజేపీ నేత సోము వీర్రాజు చెప్పారు. అభివృద్ధిని నిరోధించే ప్రయత్నమే స్పెషలాఫీసర్ల పాలన అంటూ విమర్శించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కాపుల రిజర్వేషన్లపై సిఎం చంద్రబాబు ఢిల్లీలో ఎవరినీ సంప్రదించకుండానే ఆరాటం, పోరాటమని అంటున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై ముఖ్యమంత్రికి వరుసగా లేఖలు రాస్తున్న ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తన మరో లేఖ సంధించారు. ఇప్పటివరకు ఇలా కన్నా నాలుగు లేఖలు రాయగా ఇది ఐదవది.
ఎన్నికల సమయంలో వివిధ కులాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని, రిజర్వేషన్ల స్థాయి పెంచుతామని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. కాపులను బీసీల్లో చేరుస్తామని, నిలదీశారు. విజయనగరం జిల్లా బలిగట్టం గ్రామంలో జరిగిన ఐదు వందల కోట్ల రూపాయల భూకుంభకోణంలో సీబీఐ విచారణకు సిద్ధమా అని ముఖ్యమంత్రిని కన్నా ప్రశ్నించారు.
జగన్మోహన్రెడ్డి దోచుకున్న లక్ష కోట్లను అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పంచుతామని గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమైందని కన్నా ప్రశ్నించారు. హెరిటేజ్ సంస్థ కోసం చిత్తూరు డైరీని దివాలా తీయించారని కన్నా తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి పనులు చేయవచ్చా అని కన్నా లక్ష్మీనారాయణ నిలదీశారు.
గతంలో లోకేష్ కు నోట్ల కుంభకోణం నిందితుడు శేఖర్ రెడ్డికి సంబంధం ఉందంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణ చేయగా తాజాగా ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తన లేఖలో ఇదే ఆరోపణ చేశారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్రెడ్డికి, లోకేశ్కు మధ్య సంబంధాలు ఉన్నాయని కన్నా ఆరోపించారు. శేఖర్రెడ్డి వ్యవహారాలు, లోకేశ్తో సంబంధాలపై సీబీఐ విచారణకూ సిద్ధమా?... అని కన్నా సవాల్ చేశారు.
కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటివరకూ సిఎం చంద్రబాబుకు నాలుగు లేఖలు రాయగా బుధవారం రాసిన లేఖ ఐదవది. ఈ ఐదు లేఖల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కన్నా లక్ష్మీనారాయణ మొత్తం 25 ప్రశ్నలను సంధించారు.