నీరసించిన జగన్: వైసిపితో బిజెపి చేతులు కలపదు, లక్ష కోట్లు దోచి..
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన బిజెపి, టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ దీక్ష శుక్రవారం నాడు మూడో రోజుకు చేరుకుంది.
జగన్కు శుక్రవారం ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న సందర్భంగా జగన్ నీరసించారని చెప్పారు. జగన్ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారని, కాకపోతే బిపి, షుగర్ నార్మల్గానే ఉందని చెప్పారు.
బరువు కూడా తగ్గలేదన్నారు. కొంతవరకు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అయితే, దీక్ష ఇలాగే కొనసాగిస్తే రేపు ప్రత్యేక పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందని చెప్పారు. కాగా, జగన్ దీక్షకు పలువురు మద్దతు పలుకుతున్నారు.

జగన్పై కామినేని ఆగ్రహం
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు ప్రారంభించారు. ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జగన్ రాజకీయ ఉనికిని చాటుకునేందుకే దీక్షలు చేస్తున్నారన్నారు. అవినీతిపరుడైన జగన్తో బీజేపీ ఎన్నటికీ కలవదన్నారు. జగన్ - బిజెపి కలుస్తారేమోననే చర్చ కొద్దికాలంగా సాగుతోన్న విషయం తెలిసిందే.
లక్ష కోట్లు దోచుకున్న జగన్: కొల్లు
జగన్ లక్ష కోట్లు దోచుకొని ఇప్పుడు దీక్షలు చేయడం విడ్డూరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందన్నారు. లక్షల కోట్లు దోచుకొని ఇప్పుడు దీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసిపి నేతల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications