'పవన్ కళ్యాణ్-జగన్ అండతో బీజేపీ రంకెలు, అందుకే టీడీపీపై కక్షసాధింపు'
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు శుక్రవారం మండిపడ్డారు. సీబీఐ అధికార పార్టీ జేబు సంస్థ అన్నారు. పవన్ కళ్యాణ్, జగన్ అండ చూసుకొని బీజేపీ రంకెలు వేస్తోందని ఆరోపించారు. 20 విజయవాడలో దళితులతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రం ఒత్తిడి తీసుకురావడంతో ఏపీ విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ తోట నరసింహం ఆరోపించారు. కాకినాడకు రూ. 33 వేల కోట్లతో మంజూరు చేసిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను వేరే రాష్ట్రానికి తరలించడం తగదన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అడగడం నేరమా అన్నారు.
బీజేపీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 21 నుంచి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తారన్నారు.
కేంద్రం నుంచి సహకారంలేకపోయినా చంద్రబాబు పరిపాలనా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు నెరవేర్చడం లేదన్నారు. ఇదే వైఖరిని అవలంబిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు.