మోడీ కటౌట్: బీజేపీ పెద్ద తలకాయ మీదే: సాదినేని యామిని: జగన్ అహంకారం: ప్రధాని ఫొటో ఏదీ?
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరంభమైంది. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఉద్దేశించిన టీకాలను హెల్త్ వర్కర్లకు అందజేస్తోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్ది సేపటి కిందటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్గా ఇది గుర్తింపు పొందింది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?: చరిత్ర సృష్టించిన సామాన్యుడు
బాణాసంచా కాల్చుతూ..
ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ నేతలు పండుగ చేసుకుంటోన్నారు. పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచాను కాల్చుతూ సందడి చేస్తున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు. నరేంద్ర మోడీ కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలకు పూలదండలు పూజలు చేస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో మోడీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేసిందని ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.
మోడీ సర్కార్కే సాధ్యం..
రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు సాదినేని యామిని.. ప్రధానిని ఆకాశానికెత్తేశారు. ఆయనను కింగ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ వంటి చరిత్రలో నిలిచిపోదగ్గ కార్యక్రమానికి మోడీ సర్కార్ సారథ్యాన్ని వహిస్తోందని ప్రశంసించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం మోడీ ప్రభుత్వానికే సాధ్యపడుతోందని అన్నారు. సమీప భవిష్యత్తులో మరెవరూ ఇంత భారీ వ్యాక్సినేషన్ను ఊహించుకోలేరని అన్నారు. తొలిదశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం మాటలు కాదని చెప్పారు.
రెండు జిల్లాల నుంచి
దేశంలో కరోనా వ్యాక్సిన్ను రెండు రాష్ట్రాలు, రెండు జిల్లాల్లో ఉత్పత్తి చేశారని, అది నలుమూలలకూ చేరిందని వ్యాఖ్యానించారు. వేలాది మండలాలు, లక్షలాది బ్లాకులకు వైరస్ వ్యాక్సిన్ను చేరవేయడంలో మోడీ సర్కార్ విజయం సాధించిందని చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను కేంద్రం రూపొందించిందని, అందుకే సకాలంలో వ్యాక్సిన్ను మారుమూల బ్లాక్లకు కూడా చేరవేయగలిగారని సాదినేని యామిని అన్నారు.
మూడు కోట్ల మందికి
తొలి దశలో మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయబోతోందని, రెండో విడత 27 కోట్ల మందికి దీన్ని వేస్తారని అన్నారు. వ్యాక్సిన్ల రవాణా, వాటిని భద్ర పర్చడానికి కేంద్ర ప్రభుత్వం 29 వేల కోల్డ్ చెయిన్ పాయింట్లు, 45 వేల ఐస్-లైన్డ్ రిఫ్రేజిరేటర్లు, 41,000 డీప్ ఫ్రీజర్లను సిద్ధం చేసిందని గుర్తు చేశారు. 240 వాక్ ఇన్ కూలర్లు, 70 వాక్ ఇన్ ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని సాదినేని యామినీ తెలిపారు.
ప్రధాని ఫొటో ఏదీ..
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కడప జిల్లా అధికార యంత్రాంగం రూపొందించిన ఓ బ్యానర్లో ప్రధాని మోడీ ఫొటోను ముద్రించకపోవడాన్ని సాదినేని యామిని తప్పు పట్టారు. కోవిడ్ వ్యాక్సిన్ సందర్భంలో ప్రధానమంత్రి గారి ఫొటో వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. జగన్ సర్కార్ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మోడీ ఫొటోను బ్యానర్లలో ముద్రించాలని డిమాండ్ చేశారు.