ప్యాకేజీ స్టార్ శివాజీ...భలే బురిడీ కొట్టిస్తున్నారు: బీజేపీ మహిళా నేత గాయత్రి
గుంటూరు: ప్యాకేజీ స్టార్ శివాజీ మరోసారి సరికొత్త కథా, స్క్రీన్ ప్లేతో తెరమీదకి వచ్చి భలే బురిడీ కొట్టిస్తున్నారని బీజేపీ ఎపి అధికార ప్రతినిధి సిహెచ్.గాయత్రి ఎద్దేవా చేశారు.
గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ శివాజీ తీరును దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంటి రామచిలక శివాజీ మరోసారి చిలకపలుకులు పలుకుతోందని, మళ్లీ అదే ఆవు కథ చెపుతోందని ఆమె విమర్శించారు. ముందు ఆపరేషన్ గరుడ పేరుతో బాగా హడావిడి చేసి ఇప్పుడు అందులో ఏ ఒక్కటీ జరగకపోవడంతో నాలుక కరుచుకున్న శివాజీ ఈసారి మరో కొత్త కథ, స్క్రీన్ ప్లేతో తెరపైకి వచ్చారన్నారు.
చంద్ర బాబుకు కేంద్ర నోటీసులు ఇస్తుందని చెపుతున్న శివాజీ ఏ కేసులో ఇస్తుందో చెబితే కొంతైనా విశ్వనీయత వుండేదన్నారు. టీడీపీ కోసం శివాజీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అంతేతప్ప తనకు ప్రాణహాని ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఆయనకు ప్రాణహాని టిడిపి నుంచా? మరో పార్టీ నుంచో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
దేశం నుంచి ఎపిని విడగొట్టాలంటున్న శివాజీ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని...శివాజీ పై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలన్నారు. ఒకవేళ సిఎంకు నోటీసులు వస్తే విలేకరుల సమావేశం పెట్టాల్సింది టిడిపి నేతలు తప్ప శివాజీ కాదన్నారు. ఆటలో అరటిపండు మాదిరి అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టిహడావుడి చేసే శివాజీ సినిమా హీరోనా? లేక టిడిపి నేతా? అని తమకు సందేహాలు కలుగుతున్నాయన్నారు. టిడిపి కోసమే శివాజీ బిజెపిపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని గాయత్రి ఆరోపించారు.
శనివారం సాయంత్రం సినీ నటుడు శివాజీ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర సంస్థ నుంచి త్వరలో నోటీసులొస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ విషయమై విలేకరులు వివరాలు అడుగగా ప్రస్తుతానికి తాను ఇంతకుమించి ఏమీ చెప్పలేనని...ఇప్పటికే తనకు ప్రాణ హాని పొంచి ఉందని చెప్పడం సంచలనం రేపింది.