Pawan Kalyan: తమరి రాక ఆలస్యం: పవన్ కోసం వేచి చూసి: జేపీ నడ్డాతో పవన్ భేటీపై తర్జనభర్జన..!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్తో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ వాయిదా పడింది. ముందే నిర్ధారించిన షెడ్యూల్ ప్రకారం.. వారిద్దరి మధ్యా శనివారం రాత్రే సమావేశం ఏర్పాటు కావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ రాక ఆలస్యం కావడం వల్ల కుదరలేదు. దీనితో ఈ సమావేశం నేటికి వాయిదా పడింది. ఫలితంగా- ఈ సమావేశం సమయం, వేదికలో స్పష్టత రాలేదు. ఢిల్లీలోనే కలుస్తారా? లేక హైదరాబాద్లో ఈ సమావేశం ఉంటుందా? అనేది తేలాల్సి ఉంది.
హడావుడిగా హస్తినకు వెళ్లినా..
బీజేపీ అధిష్ఠానం నుంచి పవన్ కల్యాణ్కు పిలుపు వచ్చిన నేపథ్యంలో.. ఆయన హడావుడిగా హస్తినకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిన సమయంలో పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉన్నారు. ఫోన్ కాల్ అందిన మరుక్షణమే ఆయన నాదెండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయినప్పటికీ.. సమయానికి జేపీ నడ్డాతో భేటీ కాలేకపోయారు.
10 నిమిషాల పాటు వేచి చూసి..
షెడ్యూల్ ప్రకారం.. శనివారం సాయంత్రం 7 గంటల తరువాత జేపీ నడ్డా.. పవన్ కల్యాణ్తో సమావేశం కావాల్సి ఉంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీని ఏర్పాటు చేశారు. అనుకున్న సమయానికి పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లలేకపోయారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా జేపీ నడ్డాకు ఫోన్ చేసి.. క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. విమానం ఆలస్యం కావడం వల్ల రాలేకపోతున్నానని, కొద్ది సేపట్లో తాను కలుసుకుంటానని వివరణ ఇచ్చుకోవడంతో.. జేపీ నడ్డా సుమారు 10 నిమిషాల పాటు వేచి చూసినట్లు సమాచారం. నడ్డాతో సమావేశం వాయిదా పడటంతో ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే మకాం వేశారు.
హైదరాబాద్కు జేపీ నడ్డా..
అప్పటికీ పవన్ కల్యాణ్ అందుబాటులో రాలేకపోవడంతో జేపీ నడ్డా పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారని అంటున్నారు. దీనితో ఈ సమావేశాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం.. జేపీ నడ్డా ఆదివారం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
హైదరాబాదా? ఢిల్లీనా?
జేపీ నడ్డా స్వయంగా హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్తో సమావేశం వేదిక కూడా మారిపోయే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. హైదరాబాద్లో బీజేపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తరువాత.. ఆయన పవన్ కల్యాణ్ను కలుస్తారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉన్నందు.. హైదరాబాద్కు బయలుదేరి వెళ్లే ముందైనా నడ్డా ఆయనను కలుసుకునే అవకాాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది.