సీఎం రమేష్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటే సరిపోదు:జీవీఎల్;నంబర్ వన్ బినామి:అంబటి రాంబాబు
న్యూఢిల్లీ:ఐటీ అధికారులు సోదాలపై టీడీపీ ఎంపి సీఎం రమేష్ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. బిజెపి ఎంపి జివిఎల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సిఎం రమేష్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
ఒక్క ఏపీలోనే కాదు....అన్ని రాష్ట్రాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయని...ఎవరిపైనా కక్ష సాధింపులు జరపడం లేదని తేల్చేశారు. దేశంలో 2016-17లో 1152 ఐటీదాడులు, 2017-18లో 600 సోదాలు జరిగాయని జివిఎల్ గుర్తుచేశారు. టీడీపీ నేతలు ప్రగల్బాలు పలకకుండా ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జీవీఎల్ సూచించారు.మరోవైపు వైసిపి నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎం రమేశ్ నంబర్వన్ బినామీ అన్నారు.
అధికారులకు...సమాధానం చెప్పండి
టిడిపి,సిఎం రమేష్ తమకు తానుగా క్లీన్చిట్ ఇచ్చుకుంటే సరిపోదని, అధికారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని జివిఎల్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఐటి దాడులపై రాజకీయ ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని ఎంపి జివిఎల్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐటీ సోదాలను రాజకీయం చేయొద్దని జివిఎల్ సూచించారు.
ముందే...సర్థుకున్నారట
అయినా సిఎం రమేష్ తమకు ఉన్న ముందస్తు సమాచారంతో అంతా సర్దుకున్నామని ఆయనే చెబుతున్నారని జీవీఎల్ విమర్శించారు. టీడీపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాజకీయాలను మార్కెట్గా మార్చారని మండిపడ్డారు. రాజకీయ పదవుల్లో ఉండి అవినీతికి పాల్పడుతున్నారని జివిఎల్ దుయ్యబట్టారు.
మీసం మెలేస్తే...తొడలు కొడుతున్నారు
మరోవైపు విజయవాడలో వైసిపి నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే అధికార పార్టీ తెలుగు దేశంకు భయమెందుకని ప్రశ్నించారు. సాధారణ ఐటీ దాడులను ప్రేరేపిత దాడులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు సీఎం రమేశ్ నంబర్వన్ బినామీ అని ఆరోపించారు. అసలు వైఎస్ జగన్ను విమర్శించే నైతిక హక్కు రమేష్ కు లేదన్నారు. సీఎం రమేష్ మీసం మెలేస్తే ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
అన్నీ...సబ్ కాంట్రాక్ట్ లే
రిత్విక్ సంస్థ గతంలో ఎప్పుడైనా డైరెక్టుగా భారీ కాంట్రాక్టు ఒక్కటైనా చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థవన్నీ సబ్ కాంట్రాక్టులేనని, అవన్నీ బెదిరించి తీసుకున్నవేనని అంబటి ఆరోపించారు. తన జీవిత భాగస్వామి,కుటుంబ సభ్యులకు తెలియకుండా తన వేలిముద్ర ఉంటేనే తెరుకునే లాకర్లు ఇంట్లో ఉండటమేమిటని అంబటి ప్రశ్నించారు. ఆ లాకర్లలో ఏమి దాచారో సిఎం రమేష్ బైటపెట్టాలన్నారు.
గెస్ట్ హౌజ్...రాజకీయాల వల్లే
సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్ కాబట్టే అలాంటి లాకర్లు ఇంట్లో పెట్టుకున్నారని అంబటి దుయ్యబట్టారు. ఇవన్ని చేస్తూ కూడా మీసం మెలేస్తున్నారని... పచ్చకాలం అంటే ఇదేనని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరిగాయని...మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు కానీ అలా విడిపోయారని విమర్శించారు. సీఎం రమేష్ సారా కాంట్రాక్టర్ దశ నుంచి ఎంపీ స్థాయికి రావడానికి గెస్ట్హౌజ్ రాజకీయాలే కారణమని అంబటి ఆరోపించారు. అయితే పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు వీరికి బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి వ్యాఖ్యానించారు.