రాష్ట్ర నిధులతో పార్టీ సభలు...చూస్తూ ఊరుకోం:జివిఎల్,బాబుకు అంత దమ్ము లేదు:వైసిపి
న్యూఢిల్లీ,విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడాన్ని జీవీఎల్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ ఊరుకోబోమని జివిఎల్ హెచ్చరించారు.
చంద్రబాబు తిరుమలను కూడా ఒక రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలా అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని జివిఎల్ డిమాండ్ చేశారు. మరోవైపు విజయవాడలో వైసిపి నేత అంబటి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పొత్తు లేకుండా పోటీ చేయలేరని ఎద్దేవా చేశారు.
ఎవరూ...ప్రతిపాదించలేదు
చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నట్లుగా ఆయనను ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నేతా ప్రతిపాదించలేదని బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు. అప్పటి పరిస్థితుల్లో అది తుమ్మితే ఊడిపోయే పదవి అని ఆయనే ప్రధాని పదవికి దూరంగా ఉన్నారని, ఆ కారణంతో పదవికి ముందుకు రాకుండా ఇప్పుడేదో పెద్ద త్యాగం చేసినట్లుగా చంద్రబాబు ఫోజులు కొడుతున్నారని జివిఎల్ విమర్శించారు.
వెనకాడటం...ఎందుకు?
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై చంద్రబాబు విచారణ ఆదేశించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని జివిఎల్ ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక బిజెపిని తూలనాడుతూ వచ్చే ఎన్నికల్లో తనేదో చక్రం తిప్పుతానంటూ చంద్రబాబు పగటి కలలు కంటున్నారని జివిఎల్ ఎద్దేవా చేశారు.
మరోవైపు...వైసిపి అంబటి
బిజెపితో వైసిపి పొత్తంటూ టిడిపి చేస్తున్న ఆరోపణలను వైసిపి నేత అంబటి రాంబాబు తిప్పికొట్టారు. విజయవాడలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకే అలవాటని, గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, అన్నారు. కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోంది. సింగిల్గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఈ పొత్తులు...నిజం కాదా?
1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు...2009లో వామపక్షాలు, టీఆర్ఎస్తో పొత్తు...తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టడం నిజం కాదా అని అంబటి ప్రశ్నించారు. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటే. దేశంలో ఏ పార్టీతోనూ చంద్రబాబు నిజాయితీగా పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి అవ్వాల్సిందే. చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారని అంబటి విమర్శించారు. అయితే ఇక చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో ఎవరూ కలవరన్నారు. చంద్రబాబు కులం పేరుతో అందరినీ విభజిస్తున్నారని, చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.