బీజేపీకి జగన్ తోడు, ఆత్మరక్షణలో బాబు: నాని-బుద్ధాలకు క్లాస్
విజయవాడ: బెజవాడలో దేవాలయాల కూల్చివేత విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. కృష్ణా పుష్కరాల కోసం ఆలయాల కూల్చివేత విషయంలో మిత్రపక్షం బీజేపీ, విపక్షం వైసిపిలతో పాటు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో, తెలుగుదేశం పార్టీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిన్న విషయాన్ని అనవసర రాద్ధాంతంతో రచ్చ చేశారని మండిపడ్డారని సమాచారం.
రహదారుల విస్తరణలో భాగంగా తొలగించిన గుడుల అంశంలో సున్నితంగా వ్యవహరించకుండా బీజేపీ నేతలపై విరుచుకుపడిన కేశినేని నాని, బుద్ధా వెంకన్నలకు ఆయన క్లాస్ పీకారని సమాచారం. మీ వ్యక్తిగత విభేదాల వల్లే సమస్యను పెద్దది చేశారని, మిత్రపక్షం నుంచి విమర్శల దాడి పెరగడానికి కారణమయ్యారని ఫైరయ్యారు.
ఎవరిష్టానికి వారు ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తుంటే సహించబోనని హెచ్చరించారని తెలుస్తోంది. వెంటనే స్థానికులను శాంతింపజేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హితవు పలికారు. ఆలయాల తొలగింపు దుమారం రేపిన విషయం తెలిసిందే.