బీజేపీ, వైసీపీ కుమ్మక్కు!.. అదే పెద్ద రుజువు: మంత్రి నారాయణ
నెల్లూరు: బీజేపీ, వైసీపీ రెండూ రాజకీయంగా కుమ్మకయ్యాయని చెప్పడానికి కన్నా లక్ష్మీనారాయణ నియామకమే పెద్ద రుజువని మంత్రి నారాయణ అన్నారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో కన్నా చేరిక ఆఖరిక్షణంలో వాయిదా పడిందని, అనూహ్యంగా బీజేపీ అధ్యక్ష పదవి వరించిందని పేర్కొన్నారు. కన్నాకు పదవికి దక్కడం వెనుక.. జగన్తో అమిత్షా, రాంమాధవ్ మాట్లాడింది వాస్తవం కాదా? అని నారాయణ ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ బీజేపీ పెద్దల ఆదేశాలను ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. వైసీపీ, జనసేనలతో లాలూచీకే బీజేపీ కన్నాను అధ్యక్షుడిని చేసిందని ఆరోపించారు.
సీఎం కుర్చీ కోసం జగన్ ఏమైనా చేస్తాడు: అయ్యన్న
సీఎం కుర్చీ కోసం వైసీపీ అధినేత జగన్ ఏ పని చేయడానికైనా సిద్ధపడుతారని, ఎంతకైనా దిగజారుతారని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖపట్నంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ1 నిందితుడు జగన్, ఏ2 విజయ సాయిరెడ్డి పాదయాత్రలకు జనాలు స్పందిస్తున్నారని అనుకోవడం వైసీపీ నేతల పొరపాటేనని, ఆ పాదయాత్రలు విఫలమవుతున్నాయని చెప్పారు. ఈ నెల 22న విశాఖపట్నంలో జరిగే సీఎం ధర్మ పోరాట దీక్ష విజయవంతం చేయాలని, ఈ దీక్షలో లక్షమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
బీజేపీలో కుల సమీకరణాలకు తావు లేదు: రాం మాధవ్
చంద్రబాబు వ్యవహారశైలి మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు ఉందని ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్. తమ పార్టీలో కులాల వారీగా బాధ్యతలు ఇవ్వడం జరగదన్నారు. వసరాన్ని బట్టి, ప్రజల ఆమోదం మేరకే అధిష్టానం నిర్ణయాలు ఉంటాయన్నారు. బీజేపీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు ఇకనుంచి ఏపీ రాజకీయాలకూ, పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రంలో కన్నా నాయకత్వంలో టీడీపీ వైఫల్యాల గురించి ప్రజలకు చెబుతామని అన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని తిప్పికొడుతామని చెప్పారు.