బాబు దీక్ష, విపక్షాల ప్రశ్నలు: బాలకృష్ణపై బీజేపీ ఆగ్రహం, పవన్ కళ్యాణ్ సీరియస్
అమరావతి: ఓ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరాహార దీక్షపై వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో పాయింట్తో బాబుపై మండిపడుతున్నారు. ఇన్నాళ్ళు బీజేపీతో కలిసి ఉండి, ప్రత్యేక హోదా అంశాన్ని తొక్కి పెట్టారని, ఇప్పుడు దాని గురించే దీక్ష చేయడం విడ్డూరమని కాంగ్రెస్, వైసీపీ, పవన్ కళ్యాణ్ మండిపడుతున్నారు.
అక్కడకెళ్లి చెప్తావా?: బాబు దుమ్ముదులిపిన కృష్ణంరాజు, శ్రీరెడ్డి ఇష్యూపై స్పందన
మరోవైపు, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చెప్పింది చంద్రబాబేనని, నాడు ప్యాకేజీకి ఒప్పుకొని ఇప్పుడు హోదా కోసం దీక్షలు చేయడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. హోదా అంశంలో చంద్రబాబు ఎన్నోసార్లు మాటలు మార్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆయన దీక్షలో అర్థం లేదని అంటున్నారు. చంద్రబాబు దీక్ష వేదిక పై నుంచి పలువురు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్
అయితే, నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు బీజేపీఎల్పీ విష్ణు కుమార్ రాజు, ఆ పార్టీ అధికార ప్రతినిధి విల్సన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.
అసలు బాలకృష్ణ ఏమన్నారంటే?
ధర్మపోరాటం దీక్ష వేదికగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చారు. ఏపీ గుజరాత్ కాదని, ఇష్టం వచ్చినట్లు పాలిస్తామంటే కుదరదన్నారు. మోడీజీ.. భజనగాళ్ల మాట వినకండి.. ఆంధ్రుల ఆవేదన వినండి అని మండిపడ్డారు. తెలుగువాళ్లు అంటే పిరికివాళ్లు కాదని, రాజకీయాలకే కొత్త అర్థం ఇచ్చిన వాళ్లు అన్నారు. తెలుగు వారితో ఆటలాడితే తరిమికొడతారన్నారు. తమ దగ్గర పవిత్ర జలాలు లేవని మోడీ నీళ్లు, మట్టి తెచ్చారా అని నిలదీశారు. వైసీపీ నాయకులు వేషాలు వేస్తూ దొంగ రాజీనామాలతో దీక్షలు చేస్తున్నారని కూడా బాలకృష్ణ మండిపడ్డారు. వైసీపీలది ప్యాకేజీ రాజకీయం అన్నారు.
ఓ దశలో హిందీలో మాట్లాడి
బాలకృష్ణ ఓ దశలో హిందీలో మాట్లాడి.. మోడీ రాజ్యాంగంతో పాటు తన భార్యను కూడా గౌరవించడం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దేశంలో రెండో ప్రధాన భాష తెలుగు అని, అది నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైందని, బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. అప్పట్లో బీజేపీకి అధికార భిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులే అన్నారు. తెలుగువారు పిరికి కాదని, చిల్లర రాజకీయాలు చేస్తూ అపహాస్యం చేయవద్దన్నారు.
వైసీపీ, బీజేపీ లోపాయికారి ఒప్పందం
వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ లోపాయికారి ఒప్పందాలు అందరికీ తెలుసునని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కొక్కరు ఒక విప్లవ యోధులు కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.