తిరుపతిలో విస్తరిస్తున్నదర్శనం టికెట్ల మాఫియా...అంతా ఓపెనే!
తిరుపతి: శ్రీవారి దర్శనంలో అక్రమాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. పైగా అడ్డదారిలో దర్శనాల టికెట్లు అమ్ముకునే అక్రమార్కులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. అంతేకాదు తమ అక్రమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు బరితెగించి పబ్లిగ్గా ప్రకటనలు సైతం ఇస్తున్నారు.
ఇలా జనసమ్మర్థం బాగా ఉండే ప్రదేశాల్లో వివిధ దర్శనాల టికెట్లకు సంబంధించి పోస్టర్లు అతికిస్తున్నారు. వాటిని చూసి తమకు ఫోన్ చేసినవారికి బ్లాక్ లో ఎక్కువ ధర తీసుకొని టికెట్లు అందచేస్తున్నారు. టిటిడి ఎంతో పకడ్బందీగా ఆన్లైన్, శ్రీనివాసం, ఇతర తితిదే కేంద్రాల్లో మాత్రమే విక్రయించే శీఘ్రదర్శనం టిక్కెట్లు ఇలా వీరి చేతికి ఎలా వస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తిరుపతిలో కొందరు అక్రమార్కులకు ఇదే మంచి లాభసాటి వ్యాపారంగా మారినట్లు తెలిసింది.
పైన ఫోటో చూశారుగా...ఇలా తిరుపతిలోని పలు బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పోస్టర్లను అంటించివేస్తున్నారు.బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి సర్, మాకు దర్శనానికి టికెట్లు కావాలనగానే ఎప్పటికి కావాలో అడిగి తెలుసుకుంటారు...ఆ తరువాత ఎన్ని టికెట్లు కావాలో అడుగుతారు...ఆ తరువాత మీకు ఈ నంబర్ ఎలా తెలిసిందని ఆరా తీస్తారు...అనుమానాస్పదం అనిపించకపోతే టికెట్ల ధరలు ఆ పైన తమ లాభం ఎందో చెప్పి...ఒకే అనుకుంటే...దర్శనానికి వచ్చే వారందరి ఆధార్కార్డులను వాట్సాప్ ద్వారా తెప్పించుకుంటున్నారు. ఆ తరువాత వారు చెప్పిన చోటకు వెళ్లి డబ్బులు తీసుకొని టికెట్లు చేతిలో పెడతారు.
శీఘ్రదర్శనం టిక్కెట్టుపై అసలు ధర రూ.300 కాగా వీరు ఒక్కో టికెట్ మీద అదనంగా రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తారు. ఇప్పుడు కొందరికి తిరుపతిలో ఈ బిజినెస్సే భారీ ఎత్తున కాసులు రాలుస్తోంది. ఇలా కొందరు దళారులు రూ.300 టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతూ లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో కేవలం 2 గంటల్లోపే దర్శనం పూర్తయ్యే అవకాశం ఉండటంతో చాలామంది డబ్బు ఖర్చు అయినా వీటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. రోజుకు ఈ టికెట్లు తితిదే 18 వేలు అమ్ముతుండగా...బ్లాక్ లో కూడా రోజూ వందలాది టిక్కెట్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ బ్లాక్ మార్కెట్ అనేక రకాలుగా సాగుతోంది. ముందుగా అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని తిరుపతికి వచ్చే వారు, తిరుమల దర్శనం గురించి సరిగ్గా వివరాలు తెలియనివారు...ఇతర రాష్ట్రాల భక్తులే లక్ష్యంగా ఈ టికెట్ మాఫియా గాళ్లు తమ టార్గెట్ చేసుకుంటారు. తిరుపతిలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాల వద్ద కరపత్రాలు, గోడపత్రికల్లో ఫోన్ నంబర్లు ముద్రించి మరీ.. బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు రైళ్లు, బస్సుల్లో వచ్చేవారితో మాటకలిపి ఈ దర్శనం టికెట్ల గురించి తెలపడం...మరి కొందరు హోటళ్లు, గెస్ట్ హౌస్ ల దగ్గరకు వెళ్లి టిక్కెట్లు కోసం మాట్లాడుతున్నారు. దళారులు మాత్రం రేపటికి టిక్కెట్లు కావాలన్నా...ఇప్పిస్తామంటారు...తమకున్న పరిచయాలతో తిరుమలలోని వివిధ విభాగాల్లోని సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎలాగోలా టికెట్లు సంపాదించి భక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకుంటారు...అలా కుదరనప్పుడు భక్తులు మోసపోతుంటారు.