రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్లు.. రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్
రాజమండ్రి : ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో కొన్నాళ్లుగా అశాంతి నెలకొంది. అమాయకులను టార్గెట్ చేస్తూ బ్లేడ్ బ్యాచ్లు రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. దొంగతనాలు, దోపిడీలే లక్ష్యంగా సాగుతున్న బ్లేడ్ బాబ్జీగాళ్ల ఆటలు నిరాంటకంగా సాగుతుండటంతో జనాల్లో అభద్రతభావం కనిపిస్తోంది.
సామాన్యుల పాలిట రాక్షసులుగా మారాయి బ్లేడ్ బ్యాచ్లు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ముఠాలు రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నా.. సదరు డిపార్టుమెంటులో కించిత్తు కదలిక లేకపోవడం గమనార్హం.
గ్యాంగ్ రేప్ బాధితురాలికి బాసట.. నష్ట పరిహారం చెల్లించాలన్న సీఎం జగన్..5 లక్షలు ప్రకటించిన హోంమంత్రి
బ్లేడ్ బ్యాచుల అరాచకాలు.. పోలీసుల నిఘా ఎక్కడ?
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. రోజురోజుకీ వారి ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అమాయకులే టార్గెట్గా సాగుతున్న వారి రాక్షస కాండకు బ్రేకులు వేయాల్సిన పోలీసులు మౌనం దాల్చుతుండటం పలు ఆరోపణలకు తావిస్తోంది. బ్లేడ్ బ్యాచులు రెచ్చిపోతున్న ఘటనలు ఏ రెండు మూడు నెలలో నుంచో కాదు ఏకంగా మూడేళ్ల నుంచి అదే తంతుగా కొనసాగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.
నిర్మానుష్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి బ్లేడ్ బ్యాచులు. ఒంటరిగా వెళుతున్నవారిపై దాడులు చేస్తూ నగదుతో పాటు బంగారు ఆభరణాలను కాజేస్తున్నారు. రాజమండ్రిలోని ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటే. చాలాప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ బాధితులు కనిపిస్తుండటం గమనార్హం.
బ్లేడులతో బెదిరిస్తూ.. అందినకాడికి దోచుకుంటూ..!
బ్లేడ్ బ్యాచుల అరాచకాలు యధేచ్ఛగా సాగుతున్నా పోలీసుల నిఘా మాత్రం కరువైంది. రైల్వే స్టేషన్, అండర్ గ్రౌండ్, ఆనం కళా కేంద్రం, నటరాజ్ థియేటర్, గోకవరం బస్ స్టాండ్ తదితర ప్రాంతాలు బ్లేడ్ బ్యాచుగాళ్లకు అనువైన ఏరియాలుగా మారాయి. ఇక రాత్రి సమయాల్లో ట్రైనులు, బస్సులు దిగి వెళుతున్న వారిని ఆటకాయిస్తూ.. మోటార్ సైకిళ్లపై వెంబడిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బ్లేడ్స్ చూపించి బెదిరించడంతో సహజంగానే జనాలు భయపడి బెదిరిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎదురుతిరిగితే ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటం లేదు.
ఇటీవల నటరాజ్ థియేటర్ సమీపంలో నిర్మిస్తున్న మున్సిపల్ స్కూల్ నుంచి ఐరన్ రాడ్స్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది బ్లేడ్ బ్యాచ్. దాంతో అక్కడ వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న సత్యం, అతడి కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే బ్లేడ్ బ్యాచ్కు చెందిన దాదాపు ఎనిమిది మంది వ్యక్తులు వారిపై క్రూరంగా దాడి చేశారు. ఈ ఘటనలో సత్యంకు గాయాలు కాగా ఆయన కుమారుడి కాలు విరిగిపోయింది.
రోజురోజుకీ ముదురుతున్న బ్లేడ్ బ్యాచులు
రాజమండ్రికి చెందిన వ్యక్తులనే కాకుండా టూరిస్టులను కూడా దోచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనకెందుకులే అనుకుంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితులు వెనుదిరుగుతుండటం వారికి మరింత ప్లస్ పాయింట్గా మారింది. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నా కూడా పోలీసుల నిఘా కొరవడడంతో మరింత రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆదివారం నాడు జరిగిన ఘటన వారి అకృత్యాలకు పరాకాష్టగా నిలుస్తోంది. ఓ వ్యక్తి వైన్ షాపు దగ్గర మద్యం సేవిస్తుండగా బ్లేడ్ బ్యాచుకు చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడిని డబ్బుల కోసం వేధించారు. అయితే అతడు నిరాకరించడంతో బీరు సీసాతో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడ్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదలావుంటే బ్లేడ్ బ్యాచుగాళ్లకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.