రంగంలో నేవీ: రూ.10 లక్షల పరిహారం.. పోలవరం వరకూ జల్లెడ: రాత్రివేళా గాలింపు కొనసాగింపు
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. మృతుల సంఖ్యను తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా.. నౌకా దళాన్ని రంగంలోకి దించింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు నౌకాదళానికి చెందిన హెలికాప్టర్లు విశాఖపట్నం నుంచి బయలుదేరాయి. సంఘటన చోటు చేసుకున్న కచ్చులూరుకు చేరుకున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాల సిబ్బంది అవే హెలికాప్టర్ల నుంచి కచ్చులూరుకు చేరుకున్నారు.
అయిదుమంది మృతి: గోదావరిలో లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు ఇవే..
రాత్రివేళ కొనసాగనున్న గాలింపు చర్యలు..
కచ్చులూరు వద్ద ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన స్థలం నుంచి దిగువన పోలవరం వరకూ గాలింపు చర్యలు చేపట్టారు జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు. రాష్ట్ర విపత్తు నిర్వహణ, స్థానిక పోలీసులు వారికి సహకరిస్తున్నారు. రాత్రి వేళ కూడా గాలింపు చర్యలు చేపట్టేలా సామాగ్రిని వారు తమ వెంట తెచ్చుకున్నారు. ఫ్లడ్ లైట్లు, స్పాట్ లైట్లు, లైఫ్ జాకెట్లు, హెడ్ లైట్ గల హెల్మెట్లను తమ వెంట తెచ్చుకున్నారు. వర్షం పడే సూచనలు లేకపోవడం వల్ల రాత్రంతా గాలింపు చర్యలను చేపడతామని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరన్ని బలగాలను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. కాగా.. కచ్చులూరు నుంచి పోలవరం వరకూ గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఫ్లడ్ లైట్లు, స్పాట్ లైట్ల సహకారంతో గోదావరిని జల్లెడ పట్టబోతున్నారు. హెలికాప్టర్ల నుంచి నదిలో జారవిడవడానికి అవసరమైన తాళ్లతో రూపొందించిన హుక్కులు, మెట్లను సిద్ధం చేసుకున్నారు.
స్థానిక మత్స్యకారుల సహకారం..
గోదావరి నది ఆటుపోట్లు గురించి క్షుణ్నంగా తెలిసిన స్థానిక మత్స్యకారుల సహకారాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీసుకోనున్నాయి. దీనికోసం మెరికల్లాంటి కొందరు మత్స్యకారులను వారు అందుబాటులోకి తీసుకున్నారు. దీనితోపాటు- పెద్ద ఎత్తున సాధారణ బోట్లు, లైఫ్ జాకెట్లుతో జల్లెడ పట్టనున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టనున్నారు. చివరి వ్యక్తి దొరికేంత వరకూ గాలింపు చర్యలు కొనసాగబోతున్నాయి. కాగా-ప్రమాదానికి గురైన లాంచీకి బోటింగ్ చేసే అనుమతి లేదని హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. ప్రయాణికులు వద్ద లైఫ్ జాకెట్లు ఉన్నాయని, నదిలో వరద ఉద్ధృతి అధికంగా ఉన్నప్పటికీ.. బోటింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బోటింగ్ కు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సామర్థ్యానికి మించి లాంచీలో పర్యాటకులను ఎక్కించుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు.
రూ.10 లక్షల పరిహారం..అన్ని విధాలుగా సహాయ, సహకారాలు
లాంచీ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమనయ వెల్లడించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రస్తుత సమయంలో బోటింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన పర్యాటక శాఖ అధికారులను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నదులు, రిజర్వాయర్లలో బోటింగ్ ను తక్షణమే రద్దు చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు బోటింగ్ పై నిషేధం విధించారు. బోటింగ్ నిర్వహణ కోసం నిపుణులతో కమిటీని వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.
బోట్లు, లాంచీలు, పడవల నాణ్యత, వాటి పనితీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని, వాటి ఫిట్ నెస్ పై సరికొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. లైసెన్స్లు పరిశీలించాలని, బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా అనే విషయాన్ని తనిఖీ చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటలను పునరావృతం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని చెప్పారు.