చేతులెత్తేసిన అధికార యంత్రాంగం: ఇక లాంచీ వెలికితీతకు ధర్మాడి సత్యం
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరిలో పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠ ప్రమాదానికి గురైన ఘటనలో అధికారులు చేతులెత్తేశారు. గోదావరిలో మునిగిన లాంచీని వెలికి తీయడానికి ఇక వారు ధర్మాడి సత్యం మీదే ఆధారపడ్డారు. లాంచీ వెలికితీత పనులను తనకు అప్పగిస్తే.. రెండు గంటల్లో దాన్ని వెలికి తీస్తానంటూ ధర్మాడి సత్యం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. లాంచీని బయటికి తీసుకుని రావడానికి అవసరమైన నైపుణ్యం, ప్రణాళిక తనకు ఉందని ఆయన గతంలో అధికారులకు తెలియజేయగా.. అప్పట్లో ఎవరూ దీన్ని పెద్దగా పరిగణించలేదు.
రోజులు గడుస్తున్నప్పటికీ.. లాంచీని బయటికి తీయడం కష్టతరమౌతున్న పరిస్థితుల్లో చివరికి ధర్మాడి సత్యం సూచనలు, సలహాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కచ్చులూరు వద్ద లాంచీ ప్రమాదానికి గురైన ఘటనలో సుమారు 50 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత లాంచీ గోదావరి నదిలో సుమారు 310 మీటర్ల దిగువకు చేరినట్లు నిర్ధారించారు. దీనికితోడు సుమారు మూడు లక్షల క్యూసెక్కుల మేర వరదనీటి ప్రవాహం ఉండటంతో లాంచీని వెలికి తీయడం సాధ్యపడలేదు. దీన్ని వెలికి తీస్తే.. మరి కొన్ని మృతదేహాలు లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. ధర్మాడి సత్యానికి చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థతో తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని విలువ సుమారు 23 లక్షల రూపాయలు. బాలాజీ మెరైన్స్ కు ఆదేశాలను కూడా జారీ చేసింది. లాంచీని వెలికి తీయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తమకు ఉందని ధర్మాడి సత్యం వెల్లడించినందున త్వరలోనే లాంచీని నదీ గర్భం నుంచి బయటికి తీయగలమని అధికారులు చెబుతున్నారు. నది అడుగు భాగాన లాంచీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. తాము పనులు ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలో దాన్ని బయటికి తెస్తామని అన్నారు.