బోటు వెలికితీతకు నేరుగా రంగంలోకి దిగనున్న గజ ఈతగాళ్లు
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించించిన విషయం తెలిసిందే... నాల్గవ రోజు కూడ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో రెండు రోజుల్లో బోటును బయటకు తీస్తామని ధర్మాఢి సత్యం తెలిపారు. అయితే రెండు రోజులుగా లంగరుకు తగులుతున్న బోటు అనుహ్యంగా జారీ పోతుండడంతో నేరుగా గజ ఈత గాళ్లను రంగంలోకి దింపుతామని చెప్పారు. ఈతగాళ్లకు సిలిండర్ల ద్వార నదిలోపలికి దింపి లంగర్లు తగించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో శనివారం కూడ బోటు వెలికి తీత ప్రయత్నాలు కొనసాగనున్నాయి.
కాగా గురువారం చేపట్టిన ఆపరేషన్లో బోటు రెయిలింగ్ బయటకు వచ్చిన నేపథ్యంలోనే బోటు మరింత పైకి వచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే లంగరు జారీ పోవడం వల్ల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని తెలిపారు. దీంతో లంగరు తగిలించేందుకు నేరుగా గజ ఈతగాళ్లు ఆక్సిజన్ సిలిండర్లతో నీటీలోకి దిగనున్నట్టు చెప్పారు. కాగా బోటును వెలికి తీసేందుకు సాంప్రదాయ పద్దతిలో ప్రోక్లైనర్తో పాటు, ఐరన్ రోప్తో పాటు ఇతర నైలాన్ తాళ్లను కూడ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే..
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద మరో రెండు రోజుల్లో ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.