బోటుకు కాంట్రాక్టు ఇప్పించింది ఆ డైరెక్టర్: చర్యలకు సీఎం జగన్ ఆదేశం..!!
గోదావరిలో మునిగి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన బోటు రాయల్ వశిష్ఠ. ఇది ప్రయివేటు బోటు. విశాఖ నగరానికి చెందిన కోడిగుడ్ల వెంకట రమణ ఈ బోటు ఓనరు. వరద ఎక్కువగా ఉందని.. ప్రయాణం వద్దని చెప్పినా వినకుండా ఇంత మంది మరణానికి కారణం ఆ బోటు నిర్వాహకులు. ప్రయాణీకుల ప్రాణాల కంటే తమ డబ్బులే ముఖ్యమనేలా వ్యవహరించారు. ఇంతటి ఘోరానికి కారణమైన ఈ బోటును గోదావరి పుష్కరాల సమయంలో ప్రారంభించారు. ఈ బోటు ఓనర్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకు సన్నిహితుడిగా ప్రచారం జరుగుతోంది.
నాడు గోదావరి పుష్కరాల సమయంలో అన్నీ తానై వ్యవహరించిన బోయపాటి శ్రీను ఆహ్వానం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాయల్ విశిష్ఠ బోటును ప్రారంభించారు. అయితే..ఇది గోదావరి పుష్కరాల నాటి సంగతి. కానీ..ఇప్పుడు అదే బోటు ప్రమాదానికి గురై..ఎంతో మంది మరణానికి కారణమైంది. ప్రమాదం పైన సీరియస్ అయిన ముఖ్యమంత్రి బోటు ఓనరుతో పాటుగా బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలకు ఇదే బోటు వేదికగా ఆ రోజు నిలిచింది.
బోటు ఆవిష్కరించింది చంద్రబాబు..
ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఆ బోటు విశాఖ నగరానికి చెందిన కోడిగుడ్ల వెంకట రమణది. ఆయన ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను కు మిత్రుడిగా చెబుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో అక్కడ చంద్రబాబు స్నానం షూటింగ్ మొదలు ముగింపు వేడుకల వరకు బోయపాటి శ్రీను ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ప్రతీ రోజు సాయంత్రం సమయంలో నిర్వహించిన కార్యక్రమాలను బోయపాటి శ్రీను దర్శకత్వంలో జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే అదే సమయంలో బోయపాటి శ్రీను ఇప్పుడు గోదావరి లో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును తన మిత్రుడిది కావటంతో..చంద్రబాబును ఒప్పించి ప్రారంభోత్సవం చేయించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. నాడు చంద్రబాబు ఆవిష్కరించిన బోటు విజువల్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బోటను ప్రయివేటుగా నే గోదావరి నదిలో పర్యాటకుల కోసం నిర్వహిస్తున్నారు. అటువంటి బోటు ఇప్పుడు నిబందనలను పక్కన పెట్టి.. అక్కడి సిబ్బంది వారిస్తున్న వినకుండా.. వరద ప్రవాహాన్ని గుర్తించకుండా..పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకొని వెళ్లి..ప్రమాదానికి గురైంది.నిబంధనల ప్రకారం కనీసం బోటులో ఎక్కిన వారి పూర్తి వివరాలను కూడా నిర్వహకులు సేకరించలేదు. లైఫ్ జాకెట్లు లేకుండా కొంత మంది ప్రయాణీకులు కనిపించినా..వారికి లైఫ్ జాకెట్ల అవసరాన్ని వివరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముందుగానే పర్యాటకుల నుండి ఆన్ లైన్ విధానంలో టిక్కెట్లు బుక్ చేసి..వారిని పాపికొండలకు తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంత మంది మరణానికి కారణమైంది.
ఆ దర్శకుడి సిఫార్సుతో అన్నీ దక్కాయంటూ..
గోదావరి పుష్కరాల సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీను కు ప్రత్యేక గౌరవం దక్కింది. దీంతోనే..ఆయన ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో తన మిత్రుడు బోటును అవిష్కరించేలా ఒప్పించగలిగారు. ఆ తరువాత ప్రయివేటు బోటుగా అనుమతి లభించింది. ఇక, గోదావరి పుష్కరాల సమయంలో తొక్కొసలాటకు నాడు షూటింగ్ కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, 12 రోజుల పాటు జరిగిన గోదావరి పుష్కరాల ముగింపు రోజున రాజమండ్రిలో గోదావరి తీరాన భారీ కార్యక్రమం ఏర్పాటు చేసారు. అందులో భాగంగా నదీ మధ్యలో హారతులు.. పెద్ద బాణ సంచా వినియోగానికి వేదికగా ఇదే రాయల్ వశిష్ఠను వినియోగించారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు ఇంత మంది మరణానికి కారణమైన ఈ రాయల్ వశిష్ఠ ఓనర్ల పైన సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసారు. ఇదే సంస్థకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసారు.
చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి
ఈ ప్రమాదానికి కారణమైన బోటు నిర్వహణా సంస్థతో పాటుగా కారకులైన ప్రతీ ఒక్కరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రాధమిక నివేదిక తెప్పించుకున్న ముఖ్యమంత్రి బోటుల నిర్వహణ ను తాత్కాలికంగా రద్దు చేసారు. బోటు నదిలోకి వెళ్తున్న సమయంలో డ్యూటీలో ఉండాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయ చర్యలు ముగిసిన తరువాత ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే..ఇప్పుడు ఘటనకు బోటు ప్రారంభానికి సంబంధం లేకపోయినా..ఆ బోటు పూర్వాపరాలు వివరిస్తూ సోషల్ మీడియాలో ఈ బోటు ప్రారంభం..బాణసంచా వినియోగం వైరల్ గా మారింది.