శ్రీకాంత్ అలాంటోడని తెలియకే వెళ్లా: కాల్ మనీపై టిడిపి ఎమ్మెల్యే బోడె
విజయవాడ: కాల్ మనీ వ్యవహరంలో ఐదో నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ అలాంటి వాడు అని తెలుస్తే అతనితో కలిసి విదేశాలకు వెళ్లేవాడిని కాదని టిడిపి పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సోమవారం చెప్పారు. ఆయన విదేశాల నుంచి విజయవాడ చేరుకున్నారు.
కాల్ మనీ వ్యవహారంలో తన పేరు వినిపించడంపై ఆయన స్పందించారు. కాల్ మనీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. శ్రీకాంత్తో తాను స్నేహపూర్వకంగానే విదేశాలకు వెళ్లానని చెప్పారు.
అతను అలాంటి వాడు అని తెలిస్తే వెళ్లేవాడినే కాదన్నారు. అలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తనకు తెలియదని చెప్పారు. నేను ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారాలను ప్రోత్సహించలేదని, ప్రోత్సహించనని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తన పైన నీచమైన ఆరోపణలు మానుకోవాలని మండిపడ్డారు. అతను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకే తన పైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్ మనీ వ్యవహారం తెలియగానే శ్రీకాంత్ను తాను మందలించానని చెప్పారు.
తాను మందలించాక అతను వేరే దేశానికి వెళ్లిపోయాడన్నారు. ప్రతి ఏడాదిలాగానే ఇప్పుడు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లానన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. బోడె ప్రసాద్ అర్ధాంతరంగా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చారు.
కాగా, ట్రాన్స్ కో డీఈ సత్యానందం కాల్ మనీ కేసులో కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సత్యానందాన్ని ఏ4 నిందితుడిగా చేర్చారు. దీంతో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి హెచ్వై దొర.. సత్యానందంను సస్పెండ్ చేస్తూ ఆదవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.