బోధన్: తెరాస గట్టిపోటీ, సుదర్శన్ రెడ్డి ఎదురీతే?
పదిహేనేళ్లుగా ఈ సీట్లో కాంగ్రెసు విజయఢంకా మోగిస్తూ వస్తోంది. బిజెపి మద్దతుతో బరిలోకి దిగిన తెలుగుదేశం ఈసారి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అత్యధిక సంఖ్యలో ఉన్న మైనార్టీ ఓట్లపై తెరాస ఆశలు పెట్టుకుంది. ఓటు బ్యాంకుతో పాటు సెటిలర్స్ ఓట్లపై తెలుగుదేశం ఆశలు పెట్టుకుంది. బోధన్ సెగ్మెంట్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. అయితే, పదిహేనేళ్లుగా దాని పరిస్థితి తారుమారైంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా వరుసగా బరిలోనికి దిగుతూ మంత్రి పదవులు అధిష్టించినసుదర్శన్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు చెల్లాచెదురు చేస్తూ వచ్చారు. ప్రధానంగా తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు గాలం వేస్తూ సుదర్శన్ రెడ్డి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి మైనార్టీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ ఖాతా నుండి చేజారకుండా ఉండేందుకు మైనార్టీలను దగ్గర తీయడంలో సుదర్శన్రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత సార్వత్రిక ఎన్నికలలో కేవలం పదహారు వందల మెజార్టీతో మాత్రమే ఆయన గట్టెక్కారు.
గత ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన మహ్మద్ షకీల్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి మరోమారు ఆయన తెరాస అభ్యర్థిగా బరిలోనికి దిగారు. ఈసారి బలంగా ఉన్న తెలంగాణవాదం తన విజయానికి తోడవుతుందన్న ఆశతో షకీల్ ఉన్నారు. క్షేత్ర స్థాయిలో సరైన ప్రణాళిక లేకపోయినా సుదర్శన్ రెడ్డి వ్యతిరేకులందరిని తన గూటికి చేర్చారు.
ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో పాటు ఎంఐఎం అధినేతలతో సంబంధాలు కలిగి ఉన్న షకీల్ అవసరమైతే ఆ పార్టీ మద్దతు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడపాటి ప్రకాష్రెడ్డి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి మైనార్టీలు తెలుగుదేశానికి ఓటు వేసే పరిస్థితి లేకపోవడంతో పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూ సెటిలర్స్ ఓట్ల ద్వారా బయట పడేందుకు ఆయన సర్వశక్తులొడ్డుతున్నారు. దీనికి తోడు బిజెపి శ్రేణులను కూడా మచ్చిక చేసుకుంటూ తెలుగుదేశం ఓటు బ్యాంకుకు తోడుగా వారి ఓటు బ్యాంకు తోడయ్యేలా ఆయన పావులు కదుపుతున్నారు.