జగన్ జైలుకు ఎందుకెళ్లారో చెప్పాలి: బొజ్జల కౌంటర్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరి ఇమేజ్ వల్ల ఎన్నికల్లో ఏపి సిఎం చంద్రబాబునాయుడు గెలిచారో ఇప్పుడు అనవసమని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఎందుకు జైలుకు వెళ్లారో ప్రజలకు వివరించాలని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతో మంది జైలు పాలయ్యారని ఆయన అన్నారు. ఒంగోలులో జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ గాలి వల్లే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో గెలిచారని వైయస్ జగన్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్గా పై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్ర చందనం ఈ టెండర్లకు అనూహ్య స్పందన వస్తోందని మంత్రి చెప్పారు.
శాంతితోనే అభివృద్ధి: చినరాజప్ప
నవ్యాంధ్ర ప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఏపి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన పూడేరు పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసుల పదోన్నతులు, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తామని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెప్పారు.