'రాధాకృష్ణ గురించి ఎవరికి తెలియదు, స్నేహమంటే వైఎస్ది, టీడీపీ ఫ్యూజులు అవుట్!'
హైదరాబాద్: రాజకీయ పార్టీలు.. వారికి డప్పు కొట్టే మీడియా.. ప్రస్తుత రాజకీయాల్లో ఈ నిర్మాణం ఒక పకడ్బంధీ వ్యూహం. పార్టీ అమలు చేయాలనుకున్న వ్యూహాన్ని ముందుగా తమ అనుకూల మీడియా ద్వారా చాటింపు చేయించడమో.. లీకులు ఇవ్వడమో చేసి.. మొత్తంగా తమ నిర్ణయానికి అటు ప్రజలు, ఇటు నేతలు కట్టుబడి ఉండే వాతావరణాన్ని సృష్టిస్తారు.
తాజా ఏపీ మంత్రివర్గ విస్తరణలోను ఈ వ్యూహాం బాగా అమలయిందేనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త. ఇందులో నిజ-నిజాల స్థాయి ఎంతవరకు ఉందో తెలియదు గానీ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడొక పోస్టు తెగ హల్చల్ చేస్తుంది. ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణను మంత్రి పదవికి దూరం చేయడం వెనుక.. టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి హస్తం ఉండటం.. ఆ విషయం తెలిసి బొజ్జల సతీమణి సదరు చానెల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఆ పోస్టు సారాంశం.
ఇంతకీ ఆంధ్రజ్యోతి ఏం చేసింది?:
టీడీపీలో చాలా సీనియర్ నాయకుడైన బొజ్జల గోపాల కృష్ణకు సీఎం చంద్రబాబుతో ఆది నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటి బొజ్జలను ఈ దఫా మంత్రివర్గం నుంచి దూరం పెట్టారు. అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న చర్చ మేరకు బొజ్జల ఆరోగ్యం అంత బాగా లేనందునే ఆయన్ను మంత్రి పదవికి దూరం పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇవే వార్తలను మంత్రివర్గ విస్తరణకు కొద్దిరోజుల ముందు నుంచి ఆంధ్రజ్యోతి బాగా హైలైట్ చేసిందనేది ప్రధాన ఆరోపణ. బొజ్జల ఆరోగ్యం బాగాలేదట, అందుకే మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చట అంటూ ఆ పత్రిక రాసిన రాతలు ఆయన్ను మంత్రివర్గానికి దూరం చేశాయని చెబుతున్నారు.
ఇదంతా వ్యూహామే:
ఆంధ్రజ్యోతిలో బొజ్జల ఆరోగ్యం పట్ల ఇలాంటి వార్తలు రావడానికి కారణం.. అది సీఎం నుంచి అమలైన వ్యూహామా? లేక పత్రికే అలా చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద మంత్రివర్గం నుంచి బొజ్జలకు ఉద్వాసన పలకడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మళ్లీ ఆంధ్రజ్యోతియే రంగంలోకి దిగి బొజ్జలను బాబుకు దగ్గర చేయాలని చూసిందట. ఇందుకోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఓ ఇంటర్వ్యూ ఎత్తుగడ వేశారట. ఇంటర్వ్యూ పేరిట బొజ్జలకు గతాన్ని గుర్తు చేసి.. గతంలో చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని మళ్లీ మళ్లీ వివరించి ఇద్దరి మధ్య ఎడం పెంచకుండా చేయాలని అనుకున్నాడట.
అనుకున్నదే తడవుగా.. ఇలా రంగంలోకి?:
ఆలోచన వచ్చిందో లేదో ఆంధ్రజ్యోతికి చెందిన అసోసియేట్ ఎడిటర్ ను బొజ్జల ఇంటికి పంపించారట రాధాకృష్ణ. తీరా అక్కడికెళ్లాక గానీ ఆయనకు అసలు పరిస్థితి అర్థం కాలేదు. ఆంధ్రజ్యోతి నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పగానే బొజ్జల సతీమణి ఎక్కడ లేని ఆగ్రహంతో ఊగిపోయారట. చేసిందంత చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వచ్చారా? అన్నట్లుగా ఆమె తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారట.
రాధాకృష్ణ బతుకెవడికి తెలియదు:
ఆగ్రహంలో బొజ్జల సతీమణి రాధాకృష్ణ గతాన్ని గుర్తు చేసి మరీ వాయించినట్లుగా సోషల్ మీడియా కథనం చెబుతోంది. రాధాకృష్ణ బతుకెవడికి తెలియదు.. ఒకప్పుడు ఎన్నిసార్లు వందా, రెండొందల కోసం అతను మా ఇంటి గడప తొక్కలేదు. అలాంటి వ్యక్తి అసలు విషయం తెలుసుకోకుండానే బొజ్జల అనారోగ్యంతో ఉన్నారు, మంత్రిపదవి నిర్వహించలేరు అని అక్కసు వెళ్లగక్కుతాడా? అంటూ గట్టిగా నిలదీశారట. దీంతో ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఇక అక్కడినుంచి జంప్ అయిపోయారని టాక్.
గంటా-సీఎం రమేశ్ లకు అదే అనుభవం:
బొజ్జల పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనకు నచ్చజెప్పేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేశ్ లు రంగంలోకి దిగి సీఎంతో పాత అనుబంధాన్ని గుర్తుచేశారట. మేమంటే ఇప్పుడొచ్చాం గానీ చంద్రబాబు-బొజ్జల మధ్య అనుబంధం ఎప్పటిది అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారట.
అయితే ఎంతకీ వీళ్ల వాదనను పట్టించుకోని బొజ్జల సతీమణి.. ఇద్దరిని కడిగిపారేశారని చెబుతున్నారు. అనారోగ్యం సాకు చూపించి బొజ్జలను పదవికి దూరం చేస్తారా? చంద్రబాబు ఆరోగ్యం మాత్రం అంత బాగుందా? అంటూ గట్టి ఝలక్ ఇచ్చారట. చంద్రబాబు బొజ్జల స్నేహాన్ని నేతలిద్దరు మళ్లీ మళ్లీ గుర్తు చేయగా.. స్నేహమంటే వైఎస్ది తన మిత్రుడు జక్కంపూడి రామ్మోహనరావుది అని బొజ్జల సతీమణి కౌంటర్ ఇచ్చారట.
జక్కంపూడి తీవ్ర అనారోగ్యంతో ఉన్నా చివరి వరకు ఆయన్ను పదవిలో కొనసాగనిచ్చారని బొజ్జల సతీమణి వారితో వాదించారట. చివరగా ఈ రాయబారాలు వద్దని తెగేసి చెప్పారట.
టీడీపీని వీడుతాం:
టీడీపీ నేతల రాయబారానికి మెత్తబడని బొజ్జల సతీమణి ఇక పార్టీలో ఉండేది లేదని కూడా తేల్చి చెప్పారట. ఈ క్రమంలో మంత్రి గంటా జోక్యం చేసుకోని.. అంత దూరమెందుకు? సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుందాం అన్నారట. గంటా వ్యాఖ్యతో మరింత ఆగ్రహానికి గురైన బొజ్జల సతీమణి నువ్వెవరు చెప్పడానికి? అంటూ ప్రశ్నించడంతో గంటా షాక్ తిన్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు, అసలు వచ్చే ఎన్నికల దాకా నువ్వు స్థిరంగా టీడీపీలో ఉండేది నీకైనా నమ్మకమేనా? అని గంటాకు కౌంటర్ ఇచ్చారట. దీంతో దిమ్మ తిరిగిన గంటాకు నోరు కూడా పెగల్లేదట. చివరకు చేసేదేమి లేక గంటా, సీఎం రమేశ్ ఇద్దరు అక్కడి నుంచి వచ్చేశారట.
టీడీపీ చెబుతోన్న వెర్షన్:
ఈ సోషల్ మీడియా కథనాన్ని పక్కనబెడితే.. బొజ్జలను మంత్రివర్గం నుంచి పక్కనబెట్టడానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెరిగిన అవినీతి, దానికి తోడు ఆయన సతీమణి, కుమారుడి జోక్యం కూడా పెరిగిపోవడమే కారణమని చెబుతున్నారు.
శ్రీకాళహస్తి ఆలయంలో అవతకవకలు జరుగుతున్నాయని, దీని వెనుక బొజ్జల సతీమణి హస్తం ఉందని గతంలోను ఆరోపణలు వచ్చాయి. భర్త మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని బొజ్జల సతీమణి జోక్యం పెరిగిపోతుండటం పార్టీకి చెడ్డపేరు తెచ్చేదిగా తయారయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలతోనే బొజ్జలకు ఉద్వాసన తప్పలేదనేది టీడీపీ చెబుతోన్న వెర్షన్.