ప్రత్యేక హోదాపై బొజ్జల సంచలన వ్యాఖ్య, బెజవాడ నుంచి పాలన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదానా లేక ప్యాకేజీయా అనేది విషయం కాదని, రాష్ట్రానికి మేలు జరగడమే ముఖ్యమని మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి సోమవారం నాడు అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆయన కాన్వాయ్ని పలువురు ఆందోళనకారులు అడ్డుకున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మంత్రి బొజ్జల తిరుపతిలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనను ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు అడ్డుకున్నారు. మునికోటి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడారు. హోదానా లేక ప్యాకేజీయా అన్నది ముఖ్యం కాదన్నారు. ఏపీకి మేలు జరగడం ముఖ్యమన్నారు. విభజించిన వారే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. మునికోటి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు: నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సిపిఐ నేత నారాయణ చెప్పారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడుతామని చెప్పారు.
ఏపీ నుంచే పాలన
ఈ నెల 17న ఏపీ కేబినెట్ విజయవాడలోనే భేటీ కానుంది. అలాగే, విజయవాడలో వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు వారంలో 4 రోజులు విజయవాడలో ఉండనున్నారు. బెజవాడ నుంచి పాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ అయ్యారు.