టీడీపీ కోసం 35ఏళ్లు కష్టపడితే.. ఇదేనా మీరిచ్చే గౌరవం?: బొజ్జల కుమారుడు
అనారోగ్యం సాకుతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా మంత్రివర్గం ఉద్వాసన పలకడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు.
శ్రీకాళహస్తి: మంత్రివర్గ విస్తరణతో టీడీపీలో చెలరేగిన అసంతృప్తులు ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేవు. పదవులు దక్కకపోవడంతో నిరాశలో కూరుకుపోయిన ఎమ్మెల్యేలను అధినేత చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా.. అంతర్గతంగా మాత్రం ఇప్పుడప్పుడే ఈ నిర్ణయాన్ని వారు జీర్ణించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
'రాధాకృష్ణ గురించి ఎవరికి తెలియదు, స్నేహమంటే వైఎస్ది, టీడీపీ ఫ్యూజులు అవుట్!'
ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. బొజ్జల సతీమణి, ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి కూడా చంద్రబాబు నిర్ణయంపై బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే పార్టీతో తెగదెంపులకు కూడా సిద్దమని ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి మరోసారి చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన తండ్రి మూడున్నర దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతుంటే.. అనారోగ్యం సాకుతో కనీసం ఒక్క మాటైనా చెప్పకుండా మంత్రివర్గం ఉద్వాసన పలకడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తమ కుటుంబానికి మంత్రి పదవులు కొత్తేమి కాదని, తన తాతయ్య కూడా మంత్రేనని గుర్తుచేశారు.
అనారోగ్యమే మంత్రివర్గం నుంచి తప్పడానికి కారణమైతే మంత్రిగా పనిచేయలేనప్పుడు ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకని తన తండ్రి రాజీనామా చేశారని గుర్తుచేశారు. బొజ్జలకు మద్దతుగా పలువురు నాయకులు రాజీనామాలు సమర్పించారని అన్నారు. టీడీపీలో మిగతా నేతలతో పోలిస్తే తన తండ్రి ఎక్కువ పర్యటనలు చేశారని సుధీర్ రెడ్డి తెలిపారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఈ సందర్బంగా సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు బాధకరమన్నారు. రెండు రోజుల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమై, తదుపరి కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.