పవన్ టార్గెట్ టీడీపీయే: 'ఏపీకి హోదా రావాలంటే ఆయనే ఉద్యమించాలి'
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా... ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చల్లో ఒకటి. సినీ నటుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తే ఏపీకి తప్పక హోదా తప్పక వస్తుందని కాంగ్రెస్ నేత, సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా హోదాపై నెలకొన్న ఉత్కంఠకు చిరవకు తెరపడిందని అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించడంతో ఏపీకి హోదా రాదాని తేటతెల్లమై పోయిందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు ఉంటాయని, పరిశ్రమలు, గ్రాంట్లు వస్తాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్యాకేజీని అంగీకరించడం చంద్రబాబు బలహీనత అని ఆయన విమర్శించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిన పరిస్థితిలో ప్యాకేజీ లేకపోతే ప్రభుత్వాన్ని నడపడటం కష్టమన్న భావనతోనే చంద్రబాబు ఈ ప్యాకేజీకి అంగీకరించి ఉండవచ్చని అన్నారు.
రాష్ట్రానికి హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 4న హెచ్చరించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని వైసీపీ, కొన్ని ఇతర పార్టీలు ఆందోళన చేస్తున్నాయని అన్నారు. వైసీపీ చేపడుతున్న ఉద్యమంపై ప్రజల్లో నమ్మకం లేదని ఆయన చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అన్న యువతకు సంబంధించిన అంశమని, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం కంటే ఎంతో కీలకమైందని చెప్పారు. రాష్ట్రానికి హోదా అన్నది ఇప్పటికే మంజూరు చేశారని, బీజేపీ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని ఆయన అన్నారు.
హోదాకు సంబంధించి ప్రధానికి పవన్ హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యమంపై ఆయన చిత్తశుద్ధి తెలుస్తోందని అన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని, ఈ హక్కును సాధించేందుకు, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసేందుకు పవన్ నేతృత్వం చాలా ముఖ్యమని చెప్పారు. పవన్ ఇచ్చిన ఒక్క పిలుపుతో లక్షలాది మంది యువకులు కాకినాడ తరలిరావడాన్ని ఆయన గుర్తు చేశారు.
ఎటువంటి కేసులు లేని పవన్ సారధ్యంలో ఉద్యమం ముందుకెళ్లే అవకాశం ఉందని అన్నారు. జగన్పై ఉన్న కేసుల వల్ల ఆ పార్టీ ఉద్యమంపై అనుమానాలు ఉన్నాయని, కాంగ్రెస్ పరిస్థితి తెలిసిందేనని అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా చట్టంలో పొందుపరిచినప్పటికీ, ప్రజలకు సరిగ్గా వివరించలేక పోయిందని అన్నారు.
ఏపీకి హోదా సాధన విషయంలో రాజకీయాలకు అతీతంగా 'హోదా' ఉద్యమం సాగాలని అన్నారు. బీజేపీపై తిరగబడిన పవన్, అతి త్వరలోనే టీడీపీపై కూడా తిరగబడే అవకాశం లేకపోలేదని అన్నారు. ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.