పవన్ సినిమాపై ప్రకటన చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ... మరి జనసేన పరిస్థితేంటి ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారన్న చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. అయితే అధికారికంగా ఆయన సినిమా చెయ్యబోతున్నారన్న వార్త నేడు బయటకు వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చెయ్యనున్నారని పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేశారు తరణ్ ఆదర్శ్. దీంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం పట్టలేకపోతున్నారు. ఇక ఇదే సమయంలో పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తేనే జనసేన పరిస్థితి దారుణంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పార్టీని నేతలు వీడి పోతున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో బిజీ అయితే పార్టీ పరిస్థితి ఏంటి అన్న చర్చ జనసేనలో జోరుగా జరుగుతుంది.
పవన్ సినిమాలవైపు దృష్టి పెట్టారని వార్తలు వచ్చినా పవన్ మాత్రం ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. కానీ తాజాగా పవన్ అభిమానులకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ చెప్పిన వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల పింక్ రీమేక్ చెయ్యటానికి ఒప్పుకున్న పవన్ నిర్మాత దిల్ రాజుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో బిగ్ న్యూస్ .. తమిళంలో బాలీవుడ్ సినిమా 'పింక్'ను రీమేక్ చేసిన బోనీ కపూర్... ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే' అంటూ తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ తో సినీవర్గాల్లో పవన్ సినిమాపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
తరణ్ చేసిన ట్వీట్ తో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోగా జనసేన పార్టీని ఏం చేస్తారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై దృష్టి సారిస్తానని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ వార్తలను ఖండించిన పవన్ మాట మార్చుకుని సినిమాలు చెయ్యాలని భావించటం జనసేన పార్టీలోని నాయకులకు మాత్రం కాస్త మింగుడుపడని విషయమే.