కోడెల ఇలాకాలో బాంబుల మోత!: టీడీపీ కార్యకర్త ఇంట్లో పేలిన బాంబులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సొంతూరుగా ప్రసిద్ధికెక్కిన గుంటూరు జిల్లాలోని నరసారావుపేట తాలుకాలోని పమిడిపాడులో శుక్రవారం ఉదయం బాంబుల మోత మోగింది. గ్రామానికి చెందిన టీడపీ కార్యకర్త ఎద్దు వెంకటేశ్వర్లు ఇంట్లో ఉదయం బాంబులు పేలాయి.
గ్రామంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించడంతో గ్రామస్తులు భయాందోళకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాంబులు పేలుడు ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
బాంబుల పేలుడు ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉంటున్న ఈ గ్రామంలో ఇప్పుడిలా బాంబులు మోత మోగడంతో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఊపందుకున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెనుమూడిలో వ్యక్తి దారుణ హత్య
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్ధానికంగా నివాసముండే కుక్కలిగడ్డ నాగఫణీంద్ర(24) అనే వ్యక్తిని సొంత బావమరిది నాగిడి నాగరాజు కత్తులతో విచక్షణా రహితంగా పొడిచాడు.
దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స అందించగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.