నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో పేలుడు, ముగ్గురు మృతి: దాచిపెట్టారా, ఉద్దేశ్యపూర్వకమా?
కర్నూలు: జిల్లాలోని నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని జొహరాపురంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. మరొక మృతుడిని ఏఎస్సైగా గుర్తించినట్లు తెలుస్తోంది.
బిడ్డలున్నా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య
మృతి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను రాజశేఖర్, మల్లికార్జునలుగా గుర్తించారు. మరొకరిని ఏఎస్సై జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. పొలానికి కొలతలు తీసుకుంటుండగా, ప్లాట్ల సర్వే కోసం తవ్వుతుండగా పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనిని సుధాకర్గా గుర్తించారు.
ఈ పేలుడు పదార్థాలు ఎక్కడివి అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఎవరైనా అక్కడ నాటు బాంబులు దాచి పెట్టారా? లేక గతంలో ఎప్పుడో ఉన్న పేలుడు పదార్థాలా? లేక ఉద్దేశ్య పూర్వకంగా పెట్టారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కానీ పేలుడు భారీగానే ఉందని చెబుతున్నారు. మృతి చెందిన వారు అన్నదమ్ములు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ గోపినాథ్ జెట్టి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
జంపాల రాజశేఖర్, మల్లికార్జునలు ఇటీవల రూ.20 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. వీరు సోదరులు. జంపాల శ్రీనివాసులు కూడా వరుసకు వీరికి సోదరుడు అవుతారు. ఒకే కుటుంబం (బంధువులు) చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో వారు బాగుండేవారని చెబుతున్నారు.