‘రైల్వే స్టేషన్లో బాంబు పెట్టాను’: వ్యక్తి అరెస్ట్, టైంపాస్ కోసమేనని..
హైదరాబాద్: రెండ్రోజుల క్రితం(గత ఆదివారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామని ఫోన్ చేసిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లికి చెందిన కడిగల్ల రాజేష్ కూలి పనిచేస్తున్నాడు.
రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం 2, 3లలో బాంబు పెట్టానని, కాసేపట్లో అది పేలుతుందని ఫోన్ చేసి పెట్టేశాడు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు హుటాహుటిన డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలతో స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. కాగా, ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేష్ను బుధవారం అరెస్టు చేశారు. ఈ విధమైన ఫోన్ కాల్ ఎందుకు చేశావని ప్రశ్నించగా.. టైం పాస్ కోసమే తాను బాంబు బెదిరింపు ఫోన్ చేశానని రాజేష్ తెలిపాడు.
లారీని ఢీకొన్న బస్సు: ఒకరి మృతి, 10మందికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో వైజాగ్ కు చెందిన అవినాష్ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో పదిమంది తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలా ఉండగా రంగారెడ్డి జిల్లా కీసర మండలం కీసరగుట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టరు బైకును ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.