కలకలం:పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబ్ స్క్వాడ్తో సహా పోలీసుల విస్తృత తనిఖీలు...కారణం ఇదే!
పశ్చిమగోదావరి:పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం...ఉన్నట్టుండి బిలబిలమంటూ దిగిన పోలీసులు...బాంబు స్క్వాడ్ బృందాలు...వచ్చీరావడంతోనే విస్తృతంగా తనిఖీలు మొదలు పెట్టాయి. ఎన్నడూలేని విధంగా...ఏమీ జరగకుండానే ఇలా సోదాలు చేపట్టడంతో స్థానికులు ఠారెత్తిపోయారు.
ఏం జరిగిందోనని భీతిల్లిపోయారు...అయితే పశ్చిమ గోదావరి జిల్లాను మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు...అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పోలీసు బృందాలు సోమవారం నుంచి ఇలా విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిసి ఊరటచెందారు.
పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఎస్ఐ మధు వెంకట రాజా ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రధాన రహదారుల వెంట, అలాగే కల్వర్టులు, బ్రిడ్జ్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఒకవైపు బాంబ్ స్క్వాడ్ లతో మరోవైపు పోలీసు జాగిలాలతో ప్రధాన కూడళ్ళల్లో తనిఖీ చేశారు. అయితే ఒక్కసారిగా పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.
తనిఖీల అనంతరం ఎస్ఐ మధు వెంకట రాజా మాట్లాడుతూ మావోయిస్టుల రాకపోకలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు,సోదాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ఇకపై ఈ ప్రాంతంలో ఈ తరహా ప్రక్రియలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.