గుంటూరులో నాటుబాంబుల కలకలం: కొనుగోలుదారుల అరెస్ట్
గుంటూరు: జిల్లాలో నాటు బాంబుల తయారీ, అమ్మకాలు కలకలం సృష్టిస్తున్నాయి. నాటు బాంబులను కొనుగోలు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. తయారీదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. రొంపిచర్ల మండలంలో తయారు చేసిన నాటు బాంబులను ఇతర ప్రాంతాల్లోకి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ బాంబుల విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. బాంబులను కొనుగోలు చేసిన వ్యక్తులు అవసరం లేకపోతే.. వాటిని తిరిగిచ్చేస్తే డబ్బులు కూడా ఈ వ్యాపారులు ఇస్తుండటం గమనార్హం.
కాగా, సోమవారం పోలీసులు పట్టుకున్న బాంబుల విలువ రూ. 14వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ బాంబులు కొనుగోలు చేసిన పలువురు ములకలూరు గ్రామస్తులు.. తమకు అవసరం లేకనో, బాంబుల నాణ్యత లేదనో తయారు చేసిన అమ్మకందారులకు తిరిగి అప్పజెప్పే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు.
బాంబులు తీసుకెళ్తున్న ఈ వ్యక్తులను విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెం గ్రామాల మధ్య పొలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రదేశం సుబాబుల్ తోటలతో అడవిని తలపించే విధంగా ఉండి తయారీదారులకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోనే బాంబులను తయారు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబులు తిరిగి తీసుకుని డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని తయారీదారులు డబ్బు ఎగ్గొట్టేందుకే పోలీసులకు సమాచారం ఇచ్చివుంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, పోలీసుల విచారణలో.. బాంబులు కొనుగోలు చేసిన వారు.. తయారీదారుల పేర్లు కూడా వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రొంపిచర్లకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.