తుని విధ్వంసానికి జగన్ పార్టీ అగ్రనేతలే కారణం: బొండా ఉమ
విజయవాడ: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన కాపు సభ సందర్భంగా తునిలో చోటు చేసుకున్న విధ్వంసానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అగ్రనేతలే కారణమని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తునిలో రైలును దగ్ధం చేయడంతో పాటు పలు హింసాత్మక కార్యక్రమాలకు ఆందోళనకారులు పాల్పడిన విషయం తెలిసిందే.
కాపులకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన అన్నారు. తుని ఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియో ఫుటేజీలను, కాల్ డేటాను దర్యాప్తు అధికారులు త్వరలోనే బయటపెడుతారని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, బొత్స సత్యనారాయణ కాపులకు అన్యాయం చేశారని ఆయన శుక్రవారంనాడు మీడియాతో అన్నారు.
కాపు భవనాలకు చంద్రబాబు పేరు పెట్టాలని కాపు నాయకులే కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. కాపు ప్రముఖుల పేర్లను ఎవరైనా సూచిస్తే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను పనిచేస్తూ అందరి చేత పని చేయిస్తున్నారని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. విజయనగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ సహించలేకపోతున్నారని దుయ్యబట్టారు.
తన ఉనికి కాపాడుకునేందుకే జగన్ దీక్షల పేరుతో మోసం చేస్తున్నారని పల్లె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అని చూడకుండా చంద్రబాబు గురించి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని మంత్రి మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం వల్లే ఆంధ్రప్రదేశ్ కష్టాలు పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.