నాడు పవన్ కళ్యాణ్పై అలా, నేడు రివర్స్: టిడిపిపై బోండా తీవ్ర వ్యాఖ్య
మంత్రి పదవి రానందుకు బోండా ఉమ, కేబినెట్ నుంచి తొలగించినందుకు బొజ్జ గోపాల కృష్ణా రెడ్డిలు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి మద్దతుగా పలువురు రాజీనామా చేస్తున్నారు.
అమరావతి: మంత్రి పదవి రానందుకు బోండా ఉమ, కేబినెట్ నుంచి తొలగించినందుకు బొజ్జ గోపాల కృష్ణా రెడ్డిలు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారికి మద్దతుగా పలువురు రాజీనామా చేస్తున్నారు.
బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు
తనకు మంత్రి పదవి రానందుకు బోండా ఉమ అలిగారు. కాపుల గొంతుకోశారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఆయనను బుజ్జగించేందుకు నారాయణ, ఎంపి కేశినేని నాని ప్రయత్నిస్తున్నారు. ఆయన మాత్రం ససేమీరా అంటున్నారు.
బోండా ఉమకు మద్దతుగా 18 మంది కార్పోరేటర్లు, 20 మంది డివిజన్ అధ్యక్షులు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరంతా బోండా ఉమ నినాసానికి చేరుకున్నారు.
అప్పుడు అలా, ఇప్పుడు ఇలా
ఎన్నికల సమయంలో కాపులకు టిడిపి ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు, కాపులకు అధికార పార్టీ అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష వైసిపి, ముద్రగడ పద్మనాభం విమర్శించినప్పుడు.. బోండా ఉమ ఎదురు దాడి చేశారు. కాపులకు న్యాయం చేసేది టిడిపి ఒక్కటే అన్నారు. ఇప్పుడు ఆయన నోటనే కాపుల గొంతు కోశారన్నారు.
బొజ్జల అసంతృప్తి
తనను కేబినెట్ నుంచి తప్పించినందుకు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు లేఖ పంపించారు.
బొజ్జలకు మద్దతుగా రాజీనామా
బొజ్జలను కేబినెట్ నుంచి తొలగించడంతో.. ఆయనకు మద్దతుగా శ్రీ కాళహస్తి ఆలయ కమిటీ వైస్ చైర్మన్ పార్థసారథి రాజీనామా చేశారు. ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు కూడా రాజీనామా బాట పట్టనున్నారు.