చెవిరెడ్డికి ఏమైనా:కడిగేసిన కోటంరెడ్డి, జగన్కి ఉమ ప్రశ్న
హైదరాబాద్: శాంతిభద్రతల పైన శుక్రవారం అసెంబ్లీలో వాడిగావేడిగా చర్చ జరిగింది. రాజకీయ హత్యల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు పెరిగాయన్నారు. పక్కా వ్యూహం ప్రకారం దాడులు చేస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ హత్యలు జరుగుతున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను మట్టు పెడుతున్నారని విమర్శించారు.
పోలీస్ స్టేషన్లలోను తమ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయన్నారు. కలెక్టర్ పైన దాడి చేసిన తూతూమంత్రంగా కేసులు పెట్టారని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా, మరో నేత అంబటి రాంబాబుల పైన దాడిగి పాల్పడ్డారని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కూడా ముప్పు ఉందన్నారు. చెవిరెడ్డికి ఏం జరిగినా చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలన్నారు.
వైయస్ పాలనలో..: ఉమ
వైయస్ పాలనలో నేర సామ్రాజ్యం విస్తరించలేదా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బొండా ఉమ ప్రశ్నించారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో 189 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారన్నారు. జగన్ మొన్ననేమో 19 మంది అన్నారని, ఇప్పుడు మరో లెక్క చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో ఏది వాస్తవమో చెప్పాలని నిలదీశారు.
పచ్చకామెర్ల వచ్చిన వాడికే ఊరంతా పచ్చకామెర్లతో కనపడుతుందనే నానుడి చందంగా... హత్యలు చేసే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు అందరూ నేరస్ధుల్లాగానే కనపడతారన్నారు. పరిటాల రవిని సాక్షాత్తూ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులు ఘోరంగా హత్య చేయించారన్నారు. దేవినేని వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. బొండా ఉమ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలన్నారు.