'ఏ2 శశికళకే నాలుగేళ్ల శిక్ష.. ఏ1 జగన్ పరిస్థితేంటో ఊహించుకోండి!'
శశికళ అక్రమాస్తుల కేసును ఉదహరిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలు గుప్పించారు.
విజయవాడ: అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ పట్ల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్ ను విమర్శించడానికి టీడీపీ నేతలకు బాగా పనికొస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీం తీర్పు చెప్పడమే ఆలస్యం.. టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా శశికళ ఉదంతాన్ని ఉదహరిస్తూ జగన్ ను విమర్శించారు. శశికళ పట్ల సుప్రీం ఇచ్చిన తీర్పు చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోందని, అక్రమాస్తులు కలిగి ఉన్న ఎవరైనా కోర్టు నుంచి తప్పించుకోలేరని బోండా ఉమా విమర్శించారు.
జయలలితకు చెందిన 66కోట్ల అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న శశికళకే నాలుగేళ్ల జైలు శిక్ష పడితే.. ఇక దేశంలోనే అత్యధికంగా 43 వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించుకోవాలని బోండా ఉమా పేర్కొన్నారు.
66కోట్ల అవినితికే నాలుగేళ్లయితే.. జగన్ సంగతేంటి?: చంద్రబాబు
శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువడటంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దానిపై స్పందించారు. శశికళ అక్రమాస్తుల కేసును జగన్ తో ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. రూ.66కోట్ల అవినీతిలో చిక్కుకున్నందుకే శశికళకు నాలుగేళ్ల శిక్ష పడితే.. రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడినవారిని ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు.
అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీ సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు శశికళ అక్రమాస్తుల కేసుపై చర్చించారు. శశికళను పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడాన్ని ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.