ఏసీ గదుల్లో కూర్చొని అసత్య ప్రచారాలు: జగన్ పార్టీపై బొండా ఉమా ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ బురద జల్లుతున్నారని ఆరోపించారు.
ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో ఏపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
మల్లాది విష్ణుకు మూడు బార్లతోపాటు మరో 10 బార్లలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని బోండా ఉమా వెల్లడించారు. జన్మభూమి ద్వారా అర్హులైన వారందరికీ రేషన్కార్డులు, పెన్షన్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి: బొజ్జల
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి కార్యక్రమం చేపట్టామని ఏపి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. జన్మభూమి కార్యక్రమాన్నిబహిష్కరించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అలా పిలుపునిచ్చినవారినే ప్రజలు బహిష్కరించాలని మంత్రి బొజ్జల సూచించారు.
తిరుమల శ్రీవారిని బుధవారం మంత్రులు బొజ్జల, గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్లు దర్శించుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామం, వార్డుల అభివృద్ధే అజెండాగా జన్మభూమి చేపట్టామని మంత్రి గంటా చెప్పారు.
ప్రభుత్వం దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. నిర్బంధ తమిళ విద్యపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని గంటా చెప్పారు.