ఆ నిధులతో ఏం చేయాలి: కేంద్రంపై టిడిపి భగ్గు, 1500 కోట్లకు కొణతాల డిమాండ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం పైన తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. అరకొర నిధులతో కొత్త రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందని నిలదీస్తున్నారు. కేంద్రం ఏపీకి రూ.1976 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిపై విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు గురువారం నాు మాట్లాడారు. పెద్ద ప్యాకేజీని ఆశించిన ఏపీ ప్రజలకు కేంద్రం తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రులకు నిరాశ కలిగించే అంశమన్నారు. అరకొర నిధులు ఇస్తే లాభం లేదన్నారు.
రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందాలన్నారు. విభజన హామీలను కేంద్రం పక్కన పెట్టటం దారుణమన్నారు. పోలవరానికి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఏపీకి హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలి: కొణతాల
ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం కేవలం రూ.50 కోట్లు ఇవ్వడం పైన మాజీ కేంద్రమంత్రి కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. రూ.50 కోట్లతో ఏం చేయాలో కేంద్రమే చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.1500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.