మాటల యుద్ధం: ఇదేం పద్ధతి.. జగన్పై నిప్పులు చెరిగిన బొండా ఉమ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బొండా ఉమ సోమవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
వైసిపి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ సంతాప తీర్మాన సమయంలోను రాజకీయం చేయడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశం పైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో చెప్పినప్పటికీ జగన్ రాజకీయం చేయడం ఏమిటన్నారు.
పుష్కరాలు ఘటన మృతులకు సంతాపం తెలియజేసేటప్పుడు జగన్ మాటలు సరికాదని బొండా ఉమ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా పైన తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ఉమ వ్యాఖ్యానించారు. హోదా ఆంధ్రుల హక్కు అని, దాని పైన వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజునే అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
జగన్, చంద్రబాబు నాయుడుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సంతాప తీర్మానం ప్రకటించే సమయంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని తప్పుపట్టారు. తర్వాత చర్చకు తాము సిద్ధమని ప్రకటించినప్పటికీ సంతాప తీర్మానం సమయంలో ఇలా మాట్లాడటం ఏమిటంటున్నారు.