జగన్పై బోండా నిప్పులు, '2050లో అలా కావాలంటే బాబు సీఎంగా ఉండాలి'
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భారీ పరిశ్రమల రాకను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భారీ పరిశ్రమల రాకను పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
జగన్కు ఉన్న అవినీతి బురదను ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అధికారం కోసం తప్పితే ప్రజలు, రైతుల సంక్షేమంపై వైసిపికి చిత్తశుద్ధి లేదన్నారు.
చంద్రబాబు సీఎంగా ఉండాలి: మంత్రి కాల్వ శ్రీనివాసులు
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమష్టిగా కలిసి పని చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు శనివారం అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నంద్యాల పార్లమెంటు పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో రాజకీయ పునరేకీకరణ జరగడంతో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని, గ్రామస్థాయి నుంచి జిల్లా నేతల వరకు అందరు ఏకతాటి పైకి వచ్చి జిల్లాలో పార్టీని మరింత బలపేతం చేస్తామన్నారు.
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యకలాపాలు ప్రజల్లోకి వెళ్లేలా కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ప్రగతి ప్రస్థానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మెరుగైన పురోగతి సాధించిందన్నారు.
2050లో ఏపీ ప్రపంచం మెచ్చే రాష్ట్రంగా అవతరించనుందని, ఈ ఘనత సాధించాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరికొన్నేళ్లు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి 2019లో టిడిపి అధికారంలోకి రావటమే ధ్యేయంగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు.