సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలి: బోండా ఉమ, జోగయ్యపై ఫైర్
విజయవాడ/హైదరాబాద్ / ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్ట నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హరిరామజోగయ్య రాసిన పుస్తకంలో వైఎస్ కాపులకు చేసిన అన్యాయం, అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదని విమర్శించారు. బిజెపి ఎమ్మెల్సీ వీర్రాజు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఉమా హెచ్చరించారు. మిత్ర ధర్మం పాటించడం వల్లే మేం సహనంతో ఉన్నామని బోండా ఉమా తెలిపారు.
సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ఏర్పాటు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ఏర్పాటుకు మిట్తో ఒప్పందం కుదిరినట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఇంక్యుబేషన్ సంస్థ ఏర్పాటుకు టెక్సాస్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 48 సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. అమరావతి కోసం 17.91 లక్షల ఈ బ్రిక్స్ కొనుగోలుకు ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపినట్లు పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు.
ఇదిలావుంటే, త్వరలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని, అందుకోసం 14 వేల ఎకరాల భూమి సేకరించామని శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎర్రంపల్లి గ్రామంలో మీ ఇంటికి భూమి కార్యక్రమం ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు అదిస్తామన్నారు. పారదర్శక పాలనకు చంద్రబాబు కృషి చేస్తున్నారని పీతల సుజాత అన్నారు.