రోజా మాట్లాడటమా: ఉమ, 'జగన్.. బినామీలు ఇక వెలుగులోకి'
విజయవాడ/గుంటూరు: తమ పార్టీ నేతల పైన నిరాధార ఆరోపణలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఫలితం అనుభవిస్తారని, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఓ ఐరన్ లెగ్ అని ఆమె విలువల గురించి మాట్లాడటం విడ్డూరమని టిడిపి నేత బోండ ఉమ గురువారం ధ్వజమెత్తారు.
సాక్షిలో వచ్చిన కథనాల పైన బోండ ఉమ తీవ్రంగా స్పందించారు. నారా లోకేష్, మంత్రుల పైన వైసిపి నేతలు చేస్తున్నవి నిరాధార ఆరోపణలు అన్నారు. వైసిపి నేతలు మాట్లాడే ప్రతి మాట పైన విచారణ చేసుకుంటూ పోయే సమయం ప్రభుత్వానికి లేదన్నారు.
నిరాధార ఆరోపణల పైన విచారణ చేస్తే.. రోజుకు ఎన్నో విచారణలు చేయాల్సి ఉంటుందన్నారు. వైసిపి నేతలు చేసే ఆరోపణలు, సాక్షి పత్రిక చేసే ఆరోపణల పైన విచారణ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే కోర్టుకు వెళ్తామని, అక్కడ తమ పైన చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు.
చంద్రబాబు పైన వైయస్ రాజశేఖర రెడ్డి కేసులు వేశారని, కానీ నిప్పులా తమ పార్టీ అధినేత బయటకు వచ్చారన్నారు. వాళ్లు వెళ్లవలసిన అవసరం లేదని, మేమే కోర్టుకు వెళ్తామని చెప్పారు. మేం కోర్టుకు వెళ్తామని, అక్కడ ఆధారాలు చూపించాలన్నారు.
తమ పైన చేసిన ఆరోపణలకు వైసిపి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సిందే అన్నారు. మంత్రులు పత్తిపాటి, నారాయణలు నీతి, నిజాయితీలు గలవారన్నారు. ఎమ్మెల్యేల వలసల అంశాన్ని దృష్టి మళ్లించేందుకే జగన్ ఇలాంటి కథనాలు బయటకు తీసుకు వచ్చారన్నారు.
ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుతూ... ఎవరి మాటలకు కాపులు ఆందోళన చెందవద్దని హితవు పలికారు. వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి కాపు సామాజిక వర్గానికి ఎవరూ నష్టం చేయవద్దన్నారు. వారం రోజుల్లో ముద్రగడ పద్మనాభం మాట మార్చారన్నారు. టిడిపి సర్కార్ పైన విషం కక్కేందుకు వైసిపి కుట్ర చేస్తోందన్నారు.
రాజకీయ సన్యాసం: రావెల సవాల్
రాజధానిలో తనకు భూములు ఉన్నాయని జగన్ నిరూపిస్తే కనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి రావెల కిషోర్ సవాల్ చేశారు. తమ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతుండటంతో నైరాశ్యంలో ఉన్న జగన్.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.
గత పదేళ్ల నుంచి తన భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. తాము అక్రమ లావాదేవాలు చేయలేదని, తమకు బినామీ ఆస్తులు లేవన్నారు. అక్రమాస్తులు ఉన్నాయని నిరూపిస్తే వార్త రాసిన వారికే వాటిని ఇచ్చేస్తానని చెప్పారు. జగన్ ఓ అరాచకవాదిగా తయారయ్యారన్నారు.
తన భార్య 83 సెంట్ల పొలం కొన్నదనేది వాస్తవమని, అంతకుమించి ఉంటే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమన్నారు. మందకృష్ణ మాదిగ తెలంగాణలో ఉద్యమాలు చేయాలని హితవు పలికారు. విభజన సమయంలో ఆంధ్రావాళ్లను వెల్లిపోమన్న మందకృష్ణ ఆంధ్రాలో మాదిగల కోసం ఎలా ఉద్యమిస్తారో చెప్పాలన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్కు భయపడి మందకృష్ణ తెలంగాణలో తిరగడం లేదన్నారు. వరంగల్లో పోటీ చేస్తే మందకృష్ణకు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయని, అలాంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. ఏబీసీడీ రిజర్వేషన్ కోసం జీవో ఇచ్చింది తామే అన్నారు. రేపటి నుంచి జగన్ గురించిన మరిన్ని అంశాలు వెలుగులోకి తెస్తామని టిడిపి నేతలు చెప్పారు.