కేసులుండటం సహజం, ఇప్పుడే కనిపించాయా?: పవన్కు బోండా కౌంటర్
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రౌడీ ఎమ్మెల్యేలను టీడీపీ ప్రోత్సహిస్తోందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Recommended Video
గురువారం బోండా ఉమ మాట్లాడుతూ.. దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్పై ఆయన చేసిన ఆరోపణలు సరికావని అన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని మాట్లాడాలని సూచించారు.
జగన్ నుంచి కాపాడింది నేనే, చింతమనేని ఓ రౌడీ, డీజీపీ గారూ! మేమే చర్యలు తీసుకోవాలా?: పవన్ నిప్పులు
ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ఎత్తి చూపిస్తున్నారని, ఏ రాజకీయ పార్టీ నాయకుడిపైనైనా అలాంటి కేసులు ఉండటం సహజమని ఉమ అన్నారు.
మూడేళ్లపాటు టీడీపీతో కలిసి పనిచేసిన పవన్కు ఇప్పుడే కేసులు కనిపించాయా? అని బోండా ప్రశ్నించారు. అంతేగాక, మహిళా అధికారిపై దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన పవన్.. అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాగా, బుధవారం దెందులూరు సభలో రౌడీ అంటూ ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.