బోండా ఉమకు షాక్, భార్యపై కేసు: రూ.40 కోట్ల భూవివాదం.. అసలేం జరిగింది?
విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ భూవివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య సుజాతపై పోలీసు కేసు నమోదయింది. ఈ వ్యవహారంలో ఆమెతో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. స్వతంత్ర సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై బాధితులు సీఐడీని ఆశ్రయించారు. దీనిపై దర్యాఫ్తు జరిపిన సీఐడీ అధికారులు సుజాతతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను బోండా ఉమ కొట్టి పారేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు.
బోండా ఉమ ఏం చెప్పారంటే
అబ్దుల్ మస్తాన్ అనే వ్యక్తి నుంచి రవితేజ బయోటెక్ అనే కంపెనీ డైరెక్టర్గా ఉన్న తన భార్య సుజాత పేరు మీద డెవలప్మెంట్ తీసుకున్నట్లు బోండా ఉమ తెలిపారు. గత ఏడాది 12వ తేదీ 4వ నెలలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించుకున్నామని చెప్పారు. ఆ భూమి ఎవరిదనేది తమకు సంబంధం లేదన్నారు. దీనికి సంబంధించి సురేష్, మస్తాన్ల మధ్య వివాదం నడుస్తుందని తెలియగానే డెవలప్మెంట్ కోసం తీసుకున్న అగ్రిమెంటును రద్దు చేసుకున్నామని చెప్పారు.
వైసీపీలోని కొందరు, కొన్ని మీడియా సంస్థలు
దీనిపై కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు, కొన్ని మీడియా సంస్థలు ఆరోపణలు చేస్తున్నాయని బోండా ఉమ అన్నారు. కానీ వాటలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. డెవలప్మెంట్ కోసం తీసుకున్నప్పుడు అన్నీ మస్తాన్ పేరిటే ఉన్నాయని, లీగల్ ఒపీనియన్ తీసుకున్నామని, దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.
ఎలాంటి సంబంధం లేదు
అన్ని వ్యవహారాలు రిజిస్టర్ డీడ్ ద్వారా జరిగాయని బోండా ఉమ తెలిపారు. డిసెంబర్లో రద్దు చేసుకున్న పత్రాలను డీజీకి సమర్పించినట్లు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న వివాదంతో తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. స్వతంత్ర సమరయోధుల భూమిని ఎమ్మెల్యే అనుచరులు తప్పుడు ధ్రువపత్రాలతో తనఖా చేయించుకున్నారనే ఆరోపణలు సరికాదన్నారు.
రద్దు చేసుకున్నాం
రూ.40 కోట్ల విలువైన భూమిని ఆక్రమించారని, నకిలీ డాక్యుమెంట్లతో ఆ భూమిని అమ్మినట్లుగా తేలిందని సమాచారం. అయితే డెవలప్మెంట్ కోసం తీసుకున్న టీడీపీ నాయకులు ఆ విషయం తెలిసి రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. వివాదాస్పద భూమి అని తెలియగానే అగ్రిమెంట్ రద్దు చేసుకున్న తర్వాత తమకు దాంతో సంబంధం లేదని చెప్పారు. ఈ మేరకు పక్కా డాక్యుమెంట్లు ఉన్నట్లు చెబుతున్నారు.
అప్పు ఇస్తామని వల వేశారు
కాగా, ఈ కేసులో ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి భూమిని కొనుగోలు చేసినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపణలు వచ్చాయి. కేసులో ఏ2గా ఉన్న ఓ వ్యక్తి అప్రూవర్గా మారారు. తనకు అప్పు ఇస్తామని వల వేశారని ఆయన పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది. తనకు తెలియకుండా క్రయవిక్రయాలు జరిగాయన్నారు. ఏ 2 నిందితుడు అప్రూవర్గా మారడంతో బోండా ఉమ పేరుతో కార్పోరేటర్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలని ఏ2 నిందితుడు పోలీసులను ఆశ్రయించారు.